రాహుల్ సీట్లిచ్చినా... చంద్రబాబు నోట్లిచ్చినా... : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీట్లిచ్చినా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోట్లు ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వెయ్యాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పిడమర్తి రవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీట్లిచ్చినా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోట్లు ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వెయ్యాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పిడమర్తి రవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్, టీడీపీలపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకున్న పార్టీలు ఓట్ల కోసం కూటమిగా వస్తున్నాయని వారికి గట్టిగా బుద్ది చెప్పాలని మంత్రి కేటీఆర్ కోరారు. అవకాశవాద పొత్తులు, అవకాశవాద రాజకీయాలు తెలంగాణపై పట్టుకోసం పోటీ పడుతున్నాయని విమర్శించారు. సీతారాం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 30 ఉత్తరాలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందా అంటూ మండిపడ్డారు.
సత్తుపల్లి నియోకవర్గం నుంచి పిడమర్తి రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన కాంగ్రెస్, టీడీపీ ఓ గట్టున, 24గంటలు కరెంట్ ఇచ్చిన టీఆర్ ఎస్ మరో గట్టున ఉందన్నారు. సత్తుపల్లి నాగన్నలు ఏ గట్టున ఉంటారో నిర్ణయించుకోవాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు సాయాన్ని రూ.10వేలకు పెంచుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సత్తుపల్లికి గోదావరి నీళ్లు కావాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. రాహుల్ గాంధీ సీట్లు ఇచ్చినా, చంద్రబాబు నోట్లు ఇచ్చినా, టీఆర్ఎస్కే ఓట్లు వేసి కూటమికి బుద్ధి చెప్పాలని సూచించారు. మహాకూటమి సీట్లు పంచుకునేలోపు టీఆర్ఎస్ స్వీట్లు పంచుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.