హైదరాబాద్ మురుగునీటి పారుదలపై ప్రత్యేక దృష్టి: కేటీఆర్
హైదరాబాద్ నగరంలోని మురుగునీటి పారుదల వ్యవస్థపై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో మురుగునీరు మరింత పెరుగుతుందని ఓ సంస్థ చేత అధ్యయనం చేయించామని మంత్రి తెలిపారు. ఎస్టీపీల ఏర్పాటుకు సంబంధించి దాదాపు 3 వేల కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలోని మురుగునీటి పారుదల వ్యవస్థపై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో 1950 ఎంఎల్టీల మురికినీరు ప్రతిరోజూ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. అదే జీహెచ్ఎంసీ వరకే చూస్తే 1600 ఎంఎల్టీల మురికినీరు ఉత్పత్తి అవుతుందని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్లో వున్న ఎస్టీపీల సామర్ధ్యం 772 ఎంఎల్టీలు మాత్రమేనని మంత్రి చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని కేటీఆర్ తెలిపారు. మూసీ ప్రక్షాళనతో పాటు చెరువులు బాగుపడాలని కేటీఆర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో మురుగునీరు మరింత పెరుగుతుందని ఓ సంస్థ చేత అధ్యయనం చేయించామని మంత్రి తెలిపారు. ఎస్టీపీల ఏర్పాటుకు సంబంధించి దాదాపు 3 వేల కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేటీఆర్ పేర్కొన్నారు. వీటి వల్ల చెరువులు, నాళాలు కూడా బాగుపడతాయని మంత్రి చెప్పారు. హైదరాబాద్ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.