ఖమ్మం జిల్లాలోని చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చోటుకు సమీపంలో గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చోటుకు సమీపంలో గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒక్కరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో, అధికారులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. మృతుడి కుటుంబం, క్షతగాత్రులను ఆదుకుంటామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కేటీఆర్ ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములుతో పాటు పలువురు పార్టీ నేతలు చీమలపాడుకు విచ్చేశారు. పార్టీ నేతల రాక సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. అయితే ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పడి సమీపంలోని గుడిసెలో మంటల చెలరేగినట్టుగా చెబుతున్నారు. దీంతో అక్కడున్నవారు గుడిసె వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో గుడిసెలో ఉన్న సిలిండ్ కూడా పేలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటనలో గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. గాయపడినవారిని పోలీసు వాహనాల్లోనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కొందరి కాళ్లు, చేతులు కూడా తెగిపడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక, ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాన్ని నిలిపివేశారు.
మరోవైపు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఖమ్మం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. గాయపడిన తమవారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
