హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన సుంకిశాల ఇన్‌టెక్ వెల్ పనులకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. భాగ్యనగరానికి 2072 వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.  

హైద‌రాబాద్ న‌గ‌రానికి (hyderabad water supply) 2072 వ‌ర‌కు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందు చూపుతో ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌న్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ (ktr) . హైద‌రాబాద్ తాగునీటి అవ‌స‌రాల నిమిత్తం.. న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ (nagarjuna sagar) వ‌ద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ (sunkishala intake well project) ప‌నుల‌కు కేటీఆర్ శనివారం శంకుస్థాప‌న చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ‌రుస‌గా ఏడేండ్లు క‌రువు వ‌చ్చినా తాగునీటికి తిప్ప‌లు లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. 

హైద‌రాబాద్ చుట్టుతా కూడా వాట‌ర్ పైప్ లైన్‌ల‌ను ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. భ‌విష్య‌త్‌లో హైద‌రాబాద్ న‌గ‌రం 100 కిలోమీట‌ర్ల మేర విస్త‌రించినా తాగునీటికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుప‌లా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామ‌ని ఆయన వెల్లడించారు. హైద‌రాబాద్, రంగారెడ్డి , మేడ్చ‌ల్ జిల్లాల ప్ర‌జ‌ల‌కు నిజంగా ఇవాళ‌ శుభ‌దినం అని కేటీఆర్ అభివర్ణించారు. మెట్రో వాట‌ర్ స‌ప్లై, సీవ‌రేజ్ బోర్డు ఆధ్వ‌ర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు.

ALso Read:రేపు తెలంగాణకు అమిత్ షా : ఈ ప్రశ్నలకు బదులేది, కేంద్ర హోంమంత్రికి కేటీఆర్ బహిరంగ లేఖ

ప్ర‌స్తుత‌ హైద‌రాబాద్‌లో నీటి అవ‌స‌రాలు 37 టీఎంసీలు.. 2072 వ‌ర‌కు ఆలోచిస్తే ఇది మ‌రో 34 టీఎంసీలకు చేరుకుంటుందని మంత్రి అన్నారు. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవ‌స‌రం ఉంటుందని అంచ‌నా వేశామ‌న్నారు. సుంకిశాల‌లో 1450 కోట్ల అంచ‌నా వ్య‌యంతో తాగునీటి అవ‌స‌రాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అద‌నంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయ‌డానికి ప‌నులు చేప‌ట్ట‌నున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే ఎండ‌కాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.