KTR:  బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని కాంగ్రెస్  పార్టీ మాజీ అధినేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

KTR: బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు కౌంటర్లు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో రాహుల్ గాంధీకి చురకలంటించితే.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 

మంత్రి కేటీఆర్ ట్విట్ చేస్తూ.. “మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు..మీదే (కాంగ్రెస్) భారత రాబందుల పార్టీ.. ఏఐసీసీ అంటేనే... అఖిల భారత కరప్షన్ కమిటీ( All India Corruption Committee). దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒక్కే ఒక్క కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ .. యూపీఏ హయంలో స్కాములు .. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదు. మా పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదు.. కాంగ్రెస్ పార్టీకి.. సీ టీమ్ అంతకన్నా కాదు. బీజేపీ-కాంగ్రెస్ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే.. ఢీ టీమ్ ”అని పేర్కొన్నారు.

“బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ములేక.. బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా ? ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మాటికీ కుప్పకూలేది కాంగ్రెస్సే. లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా ? అర్థం లేని ఆరోపణలు చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారు” అని విమర్శించారు. 

“ తెలంగాణ ప్రజలు కోరుతోంది. నిర్మాణాత్మక ప్రతిపక్షాన్ని.. కానీ, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదు. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి, మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు ” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“ కర్ణాటకలో “అన్నభాగ్య” హామీని గంగలో కలిపి ఇక్కడ 4 వేల పెన్షన్ అంటే నమ్మేదెవరు ? ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు.. ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరు ? కర్ణాటకలో బీజేపీని ఓడించింది. అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదు. మరో ప్రత్యామ్నాయం లేకే ఆ ఫలితం తప్ప. అది మీ ఘనత కాదు.. సమర్థత అంతకన్నా కాదు” అని అన్నారు.

“ సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా..? కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకోండి. 4.6 లక్షల ఎకరాలు పంచి అడవి బిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్. నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు. జల్ జంగల్ జమీన్ అనే మన్యంవీరుడు కుమ్రంభీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక ముఖ్యమంత్రి కేసిఆర్ ”అని విమర్శలు గుప్పించారు.

“మీ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తలు మా పాలనలో మన్యానికి మంచిరోజులు.. తెలంగాణలో నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ మాది. బ్రోకర్లు, కబ్జాకోరుల పక్షాన నిలబడే పార్టీ మీది( కాంగ్రెస్). కారు స్టీరింగ్ కేసిఆర్ గారి చేతిలో పదిలం.. కానీ, కాంగ్రెస్ పైనే రాహుల్ కు కంట్రోల్ తప్పింది ”అని విమర్శించారు. .

ఇంకా .. “ బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్ అయితే.. ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బీఆర్ఎస్. మా తొమ్మిదేళ్ల పాలన వెలుగుల ప్రస్థానం.. గత కాంగ్రెస్ పదేళ్ల పాలన చీకటి అధ్యాయం. కుమ్ములాటల కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కల్లోలం ”అని తెలంగాణ ప్రజలకు సూచించారు. 

“ ఇది చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ సమాజానికి తెలిసిన నిలువెత్తు నిజం. బీఆర్ఎస్ విస్తరిస్తే.. అంత వణుకెందుకు ? జాతీయ రాజకీయాలు.. మీ జాగీరా? వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశానికి దొరికిన వజ్రాయుధం బీఆర్ఎస్ ”అని సుధీర్ఘ ట్వీట్ చేశారు.