తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్టీల్ ప్లాంట్ విషయంలో గట్టిగా మాట్లాడింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పుట్లో ముందుకెళ్లడం లేదంటూ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తమ వల్లే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందన్నారు. తమతో పెట్టుకుంటే అట్లుంటదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో గట్టిగా మాట్లాడింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందున్నారు. తాము తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం ఒక ప్రకటన చేసిందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దెబ్బంటే అలా వుంటుందని మంత్రి అన్నారు. 

ALso Read: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకెళ్లలేం: కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు

కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ చెప్పారు. గురువారంనాడు ఫగ్గన్ సింగ్ విశాఖపట్టణం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఈ విషయమై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. ఈఓఐలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఎత్తుగడగా కేంద్ర మంత్రి మంత్రి అభిప్రాయపడ్డారు.