కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. కిషన్ రెడ్డి చెప్పింది తప్పయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని ఆయన డిమాండ్ చేశారు. 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 3 లక్షల 68 వేల కోట్లు పంపామన్నారు. కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది లక్షా 68 వేల కోట్లేనని కేటీఆర్ దుయ్యబట్టారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. కిషన్ రెడ్డి చెప్పింది తప్పయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. నీకు పదవికి రాజీనామా చేసే దమ్ము ఎలాగూ లేదు.. తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేయలేని అసమర్ధుడివంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం తెలంగాణ ప్రజలకైనా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు దేశానికి సేవలందించిన 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోడీ చేసిన అప్పు ఎక్కువ అని కేటీఆర్ ఆరోపించారు. 

రెండు జాతీయ పార్టీలు అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. పెట్టుబడి ద్వారా సంపద సృష్టించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. మోడీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని మంత్రి దుయ్యబట్టారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా.. జెండా, ఎజెండా, మనుషులు, డీఎన్ఏ మారలేదనపి మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

ALso REad: పెట్రోల్, డీజీల్ ధరలు తెలంగాణలోనే ఎక్కువ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఇకపోతే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రామపంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించిందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్ల రూపాయాల నిధులను అందించిందని ఆయన చెప్పారు. కానీ కేంద్రం నుండి ఒక్క పైసా కూడా రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. 

పెట్రోల్, డీజీల్ రేట్లు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెట్రోల్, డీజీల్ రేట్లపై వ్యాట్ విధించారని ఆయన చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్, డీజీల్ ధరలున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ లీడర్లు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించాలని కోరితే కొన్ని రాష్ట్రాలు పన్నులను తగ్గించిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.