కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన... మహిళలపై కేటీఆర్ సీరియస్
గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన మహిళలపై ఐటీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరగడంతో సామాన్యుడి జీవనం మరింత భారంగా మారుతోంది. దీంతో వీటి ధరలను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వుమెన్ నిరసన చేపట్టింది. అయితే వీరి నిరసనను ఐటీ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోమంత్రి, డిజిపిలకు సూచించారు.
''ప్రజాస్వామ్యయుతంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నిరసన తెలియజేయడం అనేది ఉత్తమ మార్గం. కానీ నిరసనల పేరిట బాధ్యతారాహిత్యంగా వ్యవహరించరాదు. సిలిండర్లు, బైక్స్ ను చెరువుల్లో పడేయడం వంటి నిరసనను ఖండిస్తున్నాను'' అంటూ కొందరు మహిళలు సిలిండర్ ను హుస్సేన్ సాగర్ లో వేస్తున్న ఫోటోలను జతచేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
''రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ గారు, తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి గారు... నిరసనల పేరిట బాధ్యతారామిత్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను'' అని మంత్రి కేటీఆర్ ఫిర్యాదు చేశారు.
ఇటీవల హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ జలాశయం సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇళ్లను పొందిన లబ్దిదారులతో కూడా సాగర్ లో చెత్తను వేయరాదని... ఈ జలాశయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేటీఆర్ సూచించారు. ఇలా హుస్సెన్ సాగర్ మరింత మురికూపంగా మారకుండా జాగ్రత్తపడుతున్న మంత్రికి మహిళలు నిరసన పేరిట అందులో సిలిండర్లు వేయడం ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఇలాంటి బాధ్యతారాహిత్యంపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పోలీసులకు సూచించారు.