తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మంటలు పెట్టడం కోసం బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని ఆరోపించారు.
తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మంటలు పెట్టడం కోసం బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని ఆరోపించారు. ఇది రాజకీయం కాకపోతే.. ఎందుకు రూ. 18 వేల కోట్లు ఒక్క మనిషికి ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆ రూ. 18 వేల కోట్లు మునుగోడు, నల్గొండ జిల్లా అభివృద్దికి ఇస్తే.. తాము ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటామని చాలెంజ్ చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకోనైనా సరే తమ అభ్యర్థి నామినేషన్ను ఆపుతామని చెప్పారు. తాము ఈ జిల్లా అభివృద్ది కోసమే మాట్లాడుతున్నామని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా ఇచ్చిన డబ్బులు.. మునుగోడు అభివృద్ది కోసం ఇవ్వాలన్నారు. డబ్బులు ఇస్తే తమ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటామని.. పోటీలో తమ అభ్యర్థిని నిలపమని చెప్పారు.
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కొరటికల్ గ్రామంలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణకు వస్తున్న కేంద్ర పెద్దలు ఎవరూ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. యాదాద్రి ఆలయానికి మోదీ ప్రభుత్వం 100 రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన చూసి.. గుజరాత్ ప్రజలు మోదీని ప్రశ్నిస్తున్నారని అన్నారు. గుజరాత్ ప్రజలు నిలదీస్తారని మోదీకి భయం అవుతుందని విమర్శించారు.
