కోమటిరెడ్డి బ్రదర్స్ vs జగదీశ్ రెడ్డి : మరోసారి అన్నదమ్ములను టార్గెట్ చేసిన మంత్రి.. ఘాటు వ్యాఖ్యలు
కోమటిరెడ్డి సోదరులపై మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి సహకరించాలని మంత్రి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నియోజకవర్గంలో ప్రజలే తిరుగుబాటు చేస్తారని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
కోమటిరెడ్డి సోదరులపై మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విశ్వసనీయత కోల్పోయారని.. వారికి విజ్ఞత వుంటే అభివృద్ధికి సహకరించాలని మంత్రి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నియోజకవర్గంలో ప్రజలే తిరుగుబాటు చేస్తారని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
మరోవైపు నిన్న రాత్రి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. కృష్ణా నదిలో నల్గొండ జిల్లా వాటా అమ్ముకుని డబ్బులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఉసురు తీసింది వీళ్లేనని మంత్రి మండిపడ్డారు. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా ఖబద్దార్ అంటూ జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. వాళ్ల బాసులనే తరిమి, తరిమి కొట్టామని వీళ్లెంత అంటూ మంత్రి మండిపడ్డారు. వ్యక్తిగత జీవితాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు గాను కోమటిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తహసీల్దార్ గిరిధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు చౌటుప్పల్ పోలీసులు.