బిజెపి పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందని... త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి ఖాయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

అమరావతి: దేశంలో బిజెపి (BJP) కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని... ఆ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందని తెలంగాణ దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (allola indrakaran reddy) అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని అన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వీడనాడాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఉత్తర ప్రదేశ్ (uttar pradesh) లో అధికార బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల్లో చేరుతున్నారని... ఇదే ఆ పార్టీ దీన పరిస్థితిని తెలియజేస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక విధానాలపై దేశంలోని రాజకీయ పార్టీలు ఏకం అమవుతున్నాయన్నారు. 

Video

''ఎరువుల ధరల పెంపు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్నదాతలు నాగళ్లు ఎత్తాలి. రైతులను ముంచాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలి వేయాలి. ఎరువుల ధరల పెంపుపై రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరిని బయటపెట్టాలి'' అని మంత్రి డిమాండ్ చేసారు.

''కేంద్రం దిగివచ్చే వరకు రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుంది. సీఎం కేసీఅర్ పిలుపు మేరకు అన్నదాతలు, ప్రజాప్రతినిదులు గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టాలి'' అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.

కాగా సీఎం కేసీఆర్ (KCR) పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ బండి సంజయ్ మీద టీఆర్ నేత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Jeevan reddy) విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ను ముట్టుకుంటే తెలంగాణతో పాటు దేశం, అగ్నిగుండం అవుతుందని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఛైర్మన్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తాము ఉత్తర ప్రదేశ్ (UP Election Campaign) ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని... అవసరమైతే సీఎం కూడా ప్రచారం చేస్తారని వెల్లడించారు.

ఇదిలావుంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి నాయకులు కూడా సీరియస్ అవుతున్నారు. సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్రం సీరియస్ గా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) పేర్కొన్నారు. ఆల్రెడీ కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందని... ఎప్పుడైనా కేసీఆర్ జైలుకి వెళ్లొచ్చని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ విషయం కేసీఆర్ కు తెలిసిపోయిందని... అందుకే కమ్యూనిస్టులతోనూ, విపక్ష నేతలతోనూ భేటీ అవుతున్నాడన్నారు. 

కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపిస్తుందేమోనని.. ముందుగానే కేసీఆర్ సానుభూతి కోసం యత్నిస్తున్నాడని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. దోచు కోవడం.. దాచుకోవడమే... కేసీఆర్ ను ఎక్కడున్నా గుంజుకొచ్చుడే.. కేసీఆర్ డ్రామాలు చేస్తున్నాడు. జైలుకు పోవడం పక్కా’ అని బండి సంజయ్ పేర్కొన్నాడు. అంతేకాదు ఆయన ఎన్ని డ్రామాలు చేసినా కేంద్రం వదిలిపెట్టదన్నాడు. ఫాం హౌస్ లో పండేటోడు దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తాడు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.