నా జీతంలోంచి గోశాలకు విరాళం... 150 మందికి గోవులు దానం: మంత్రి హరీష్
హైదరాబాద్ గగన్ పహాడ్ లో జరిగిన మహా మృత్యుంజయ యజ్ఞంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
హైదరాబాద్: ఏ పూజ చేసినా, ఏ శుభ కార్యక్రమం చేసినా మొదట గోపూజ చేయడం మన ఆచారం, ఆనవాయితీ అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్
గగన్ పహాడ్ లో జరిగిన మహా మృత్యుంజయ యజ్ఞంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గోవుల ప్రాధాన్యతను తెలిపి వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై వుందన్నారు.
''ఇంత మంచి గోశాలను ఏర్పాటు చేసిన సంస్థ ను అభినందిస్తున్నా. ఈ గోశాలకు ఒక రోజు అయ్యే ఖర్చు ఒక లక్షా యాభై వేల రూపాయలు నా వేతనం నుండి విరాళంగా ఇస్తాను. ఇంత పెద్ద గోశాల మన హైదరాబాద్ నగరాన్ని అనుకోని ఉంది. దక్షిణ భారత దేశంలో మొదటి, భారత దేశంలో రెండవ అతి పెద్దది గోశాల ఇదే. ఇక్కడ 5500 గోవులను మార్వాడి పెద్దలందరు సంరక్షిస్తున్నారు'' అంటూ అభినందించారు.
''కబేళాలకు వెళ్ళవలసిన గోవులను తెచ్చి రక్షించి వాటికి పునర్జన్మ నిస్తున్నారు. ఈ సమాజం అంత బాగుండాలని చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది'' అన్నారు.
''గోవు చాలా ముఖ్యమైనది. మనిషికి, రైతుకు ఆవు ఉంటే చాలు అనేవారు. పాత రోజులలో గో మూత్రం ,గో మలం, వేపాకుతో కూడిన చక్కటి సేంద్రియ ఎరువులతో కూడిన వ్యవసాయం చేసేవారు. ఈ యురియా,పెస్టిసైడ్స్ లు వాడే వారు కాదు. మంచి వ్యవసాయాన్ని చేస్తూ మంచి పంటలు పండించారు. కాబట్టే ఆరోజులలో క్యాన్సర్ లాంటి పలు ప్రమాదకర రోగాలు లేవు'' అని పేర్కొన్నారు.
''కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ ఏవిధంగా పెరిగిందో రసాయనల ఎరువుల వాడకం కూడా అలాగే పెరిగింది. అందుకే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఆర్గానిక్ షాపులు కనిపిస్తున్నాయి. అక్కడి వస్తువులను డబుల్ ధరలు పెట్టికూడా కొనుకుంటున్నాము. మళ్ళీ ఈ సేంద్రియ వ్యవసాయం గోవు, గో మూత్రం ,గో మలం ప్రాముఖ్యత ను గుర్తిస్తున్నారు. మంచి తాత్కాలికంగా పోవచ్చు కానీ చివరకు అదే నిలబడుతుంది'' అన్నారు.
''సిద్దిపేట నియోజకవర్గం లో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను గుర్తించి 150 మందికి గోవులను దానం ఇవ్వడం జరిగింది. ఆర్గానిక్ ఫామ్ సేంద్రియ వ్యవసాయం చేయండని కోరాము. ఇంతమంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు'' అని హరీష్ రావు తెలిపారు.