ఖమ్మం జిల్లా రాజకీయాలు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి మంత్రి హరీశ్ రావు వెళ్లారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని నేతల బృందం వెళ్లింది. ట్రబుల్ షూటర్గా పేరుపొందిన మంత్రి హరీశ్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్కు దూరమవుతున్న సంకేతాలు వస్తున్నాయి. పాలేరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తుమ్మల భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆత్మీయ సమ్మేళనం కూడా పెట్టారు. రేపు కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ వుంది. అలాగే ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ సభను విజయవంతం చేసేందుకే హరీశ్ రావు .. తుమ్మల ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దమ్మపేట మండలంలోని గండుగలపల్లిలో వున్న తుమ్మల ఇంటికి మంత్రి హరీశ్ రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెళ్లారు.
కాగా.. ఖమ్మం బీఆర్ఎస్లో కలకలం మొదలైంది. ఇటీవల అక్కడి నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు కొత్త సంవత్సరం వేళ తమ బలనిరూపణ చర్యలకు దిగడం, నేతల వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఆయా నాయకుల తీరును గమనిస్తే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కకుంటే పార్టీ గుడ్ బై చెప్పడానికి సైతం సిద్ధమవుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చ మొదలైంది. ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, లోక్సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్లు రాని పక్షంలో పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి.
తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. ఎన్టీ రామారావు, ఎన్.చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావు హయాంలో మంత్రిగా పనిచేశాననీ, సాగునీటి ప్రాజెక్టుల అమలులో ముగ్గురు ముఖ్యమంత్రులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రతినబూనారు. గత నాలుగు దశాబ్దాల్లో తుమ్మల జిల్లాలో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ దాదాపు 10 వేల బుక్లెట్లను పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేశారు.
మరోవైపు, తన రాజకీయ భవిష్యత్తుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం కోసం వేచి ఉండాలనీ, సంయమనం పాటించాలని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తన మద్దతుదారులను కోరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకత్వం తన పట్ల ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసునని అన్నారు. అలాగే, పార్టీలో తనకు దక్కిన గౌరవం, భవిష్యత్లో జరగబోతున్న విషయాలను ఒకసారి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు తన బృందం సిద్ధంగా ఉందని కూడా ఆయన ప్రకటించారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం ఇటీవల పరోక్షంగా తన పార్టీ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఖమ్మంలో ‘వాడవాడ పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమంలో పాలుపంచుకున్న ఆయన.. గతంలో తనను దెబ్బకొట్టడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని, రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు.
