ఈసారి కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్నా కేసీఆర్ మద్ధతు తప్పనిసరి అని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన లక్షా పదివేల కోట్లను కేంద్రం నిలిపివేసిందని ఆయన దుయ్యబట్టారు. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఆదివారం సిద్ధిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. త్వరలోనే ఢిల్లీలో వున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్నా కేసీఆర్ మద్ధతు తప్పనిసరి అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. 

ALso Read: మైనార్టీలకు రూ. 1లక్ష ఆర్ధిక సహాయం: కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు

కేసీఆర్ మద్ధతుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకుందామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని.. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన లక్షా పదివేల కోట్లను కేంద్రం నిలిపివేసిందని ఆయన దుయ్యబట్టారు. బోరుబావులకు మీటర్లు పెట్టలేదనే కక్షతో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 21 వేల కోట్లను సైతం ఇవ్వలేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.