కాంగ్రెస్ జనగర్జన సభలో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు. అప్డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అంటూ మంత్రి సెటైర్లు వేశారు.
ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు. మీది దేశాన్ని దోచుకున్న పార్టీ అని, అవినీతికి మారుపేరుగా నిలిచిన పార్టీ అని, అందుకే మీ పార్టీ పేరు స్కాంగ్రెస్గా మారిందని సెటైర్లు వేశారు. అందుకే దేశ ప్రజలు కాంగ్రెస్ను అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారని హరీశ్ రావు చురకలంటించారు.
బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని.. మాది పేద ప్రజలకు ఏ టీమ్ అని , ప్రజల సంక్షేమాన్ని చూసే ఏ క్లాస్ టీం అని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదని.. దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా, మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది అని హరీశ్ రావు ప్రశ్నించారు. అప్డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అంటూ మంత్రి సెటైర్లు వేశారు.
Also Read: బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ.. కేసీఆర్ అవినీతి మోడీకి తెలుసు, అయినా : రాహుల్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిన విషయం తెలియదా అని హరీశ్ రావు నిలదీశారు. స్కీమ్ ల్లోని స్కాం ల్లో ఆరితేరిన కాంగ్రెస్ .. కుంభకోణాల గురించి మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వల్లించడమేనని మంత్రి ఎద్దేవా చేశారు.
అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఖమ్మం సభ ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్ అంటూ మంత్రి సెటైర్లు వేశారు.
