షర్మిల , చంద్రబాబు, పవన్లకు తెలంగాణలో ఏం పని : మంత్రి గంగుల వ్యాఖ్యలు
తెలంగాణ సంపదను దోచుకునేందుకు మళ్లీ ఆంధ్రా నేతలు వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏం పని వుందని వారు వస్తున్నారని గంగుల ప్రశ్నించారు.
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. షర్మిల , చంద్రబాబు, పవన్ మళ్లీ తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఏం పని వుందని వారు వస్తున్నారని గంగుల ప్రశ్నించారు. మీ పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. వీరి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు.
నిన్న గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. ఈ సంపదపై కన్నేసిన ఆంధ్రా నాయకులు మళ్లీ రాష్ట్రంలోని గుంటనక్కల్లా ఎంటరవుతున్నారని మంత్రి గంగుల మండిపడ్డారు. షర్మిల, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, సజ్జల రామకృష్ణారెడ్డి మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే వున్నాయని.. వీరికి తెలంగాణ గడ్డపై ఏం పని అని మంత్రి ప్రశ్నించారు. వీళ్లంతా హైదరాబాద్ సంపదను కొళ్లగొట్టి మళ్లీ ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
Also REad: తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్రలు.. అందుకే గుంటనక్కల ఎంట్రీ : మంత్రి గంగుల సంచలనం
సుభిక్షంగా వున్న తెలంగాణను ఆంధ్రలో కలపడమే వీరందరి లక్ష్యమని గంగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని కాళేశ్వర ప్రాజెక్టును పగలగొట్టి నీటిని, సింగరేణి బొగ్గును తవ్వి దోచుకెళ్లాలి, కరెంట్ ను తీసుకెళ్లి మళ్లీ రాష్ట్రాన్ని గుడ్డిదీపం చేయాలని ఆంధ్రా నాయకులు చూస్తున్నారని మంత్రి గంగుల ఆరోపించారు. వీరి కుట్రలను గ్రహించి తెలంగాణ సమాజం మేలుకోకుంటే గతంలో మనం పడ్డ కష్టాలే భవిష్యత్ లో మన పిల్లలు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాబట్టి తిరుగుబాటు మొదలుపెట్టాలి ప్రజలకు మంత్రి గంగుల పిలుపునిచ్చారు.