హుజురాబాద్ లో ఆటోనగర్... మూడెకరాల భూమి కేటాయింపు: మంత్రి గంగుల
హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటోనగర్ ఏర్పాటుకు మూడెెకరాల భూమిని కేటాయించినట్లు మంత్రి గంగుల ప్రకటించారు.
కరీంనగర్: హుజురాబాద్ లో ఆటోనగర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ మూడెకరాల భూమి కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల ఆటో యూనియన్ సభ్యులకు భూమిపత్రాలను అందజేశారు.
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని మెకానిక్ లతో మంత్రి గంగుల సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... ఆటోనగర్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. కానీ కేవలం ఒక్కసారి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే మూడెకరాల భూమిని ఆటోనగర్ కోసం కేటాయించారన్నారు. కాబట్టి రానున్న హుజురాబాద్ ఉపఎన్నికల్లో ప్రతిఒక్కరు టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి అండగా నిలవాలని గంగుల సూచించారు.
read more ఎకరం భూమి, కోటి రూపాయలు... హుజురాబాద్ గౌడ కులస్తులపై మంత్రుల వరాలు
హుజురాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి వున్నారని... అందువల్లే అనేక పథకాలు ఇక్కడినుండే ప్రారంభిస్తున్నారని అన్నారు. గతంలో ఎండిపోయి పిచ్చిమొక్కలతో దర్శమిచ్చే చెరువులు నేడు నిండుకుండల్లా మారి మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే సాధ్యమయ్యిందన్నారు.
మెకానిక్ యూనియన్లతో జరిగిన ఈ సమావేశంలో మంత్రితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కరీంనగర్ మేయర్ వై.సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.