Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్...దమ్ముంటే పోతిరెడ్డిపాడుపై అలా చెయ్: మంత్రి గంగుల సవాల్

తెలంగాణ బిజెపి అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై తెలంగాణ పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. 

minister gangula kamalakar challenge to BJP MP bandi sanjay
Author
Karimnagar, First Published May 19, 2020, 7:42 PM IST

కరీంనగర్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి దమ్ముంటే పోతిరెడ్డిపాడుకు వెళ్లి పోరాటం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలాకర్ సవాల్ విసిరారు. హైదరాబాద్ లో వుండి పోరాటం చేస్తే ఏం లాభం... చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడిగా పోతిరెడ్డిపాడు సమస్యను ప్రధాని దృష్టికి తీసుకు పోయి పరిష్కరించాలని సూచించారు. 

''2009లో నేను మహారాష్ట్ర వెళ్లి బాబ్లీపై పోరాటం చేశానని... అక్కడి పోలీసులతో దెబ్బలు తినడమే కాకుండా నాపై కేసులు పెట్టిన విషయం మర్చిపోవద్దు.  ఈ విషయాలను వదిలి రాజకీయం కోసం రాష్ర్టంలో ఆందోళన చేయడం ఏంటి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో  సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా ఉన్నారు. ఎంత వరకైనా పోరాడేందుకు సిద్దంగా ఉన్నారు'' అని తెలిపారు. 

రాష్ట్రంలో 45 రోజుల్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. ఇంకా కొనుగోళ్లు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో 60 రోజుల్లో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారని... కానీ 45 రోజుల్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామంటే ఎంత త్వరగా కొనుగోళ్లు జరుపుతున్నామో అర్థం చేసుకో వచ్చన్నారు. 

రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో సాగు చేస్తే రైతులు బాగుపడతారని మంత్రి సూచించారు. వానాకాలం పంట వేయాలంటే ఇంతకాలం రైతులు మొగులువైపు చూసేవాళ్లని... కానీ కాళేశ్వరం జలాలతో చెరువులన్నీ నడి వేసవిలో మత్తడి దునుకుతున్నాయన్నారు. వానాకాలం పంట ఆలస్యమై కోతల సమయంలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని... ఈ సమస్య లేకుండా ముందుస్తు సాగు చేసుకునేలా నీటి వసతి కల్పించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. 

గతంలో ఎస్సారెస్పీలో నీరు లేక కాకతీయ కాలువ చివరి ఆయకట్టుకు నీరు అందేది కాదని... ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కాలువతో కనెక్టవిటీ ఉన్న చెరువులన్నీ నింపుతామన్నారు. 

బియ్యం గింజల సైజును బట్టి రేటు వస్తుందన్న లోతైన ఆలోచనతో సీఎం కేసీఆర్ రైతులకు అవగాహన కల్పిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.  దొడ్డు రకం బియ్యం నిల్వలు దేశంలోని ఎఫ్.సి.ఐ గోడౌన్లలో మురిగిపోయే పరిస్థితులున్నాయని...కానీ సన్నబియ్యానికి మాత్రం కొరత ఉందన్నారు. అందుకే డిమాండ్ ఉన్న పంటలు రైతులు పండించాలని సీఎం  సూచించారని గుర్తుచేశారు. 

ఇక కంది పంట వేస్తే ప్రభుత్వమే కొంటుందని సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కల్తీ లేని ఆహార ఉత్పత్తులు తెలంగాణలో రావాలని.... అందుకోసమే ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ల ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని తెలిపారు. రైసు మిల్లులు నుంచి ఏర్పడే కాలుష్యం లేకుండా ఇకపై మిల్లులన్నీ ఒకే చోట ఉంచాలని చూస్తున్నామని... ఇతర ఆహారోత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

''చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరి దిగుబడి ఈ సారి వచ్చింది. దీంతో రవాణా, గోడౌన్ కొరతతో కొంత ఆలశ్యమైంది. ఖరీఫ్ లో 40 లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. ఏసంగిలో ఇప్పటికే 49 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. కొనుగోళ్లు పూర్తి కావచ్చినా ఇంకా ప్రతిపక్షాలు కళ్లాల వెంబడి తిరుగుతున్నారు'' అని ఎద్దేవా చేశారు. 

'' కరీంనగర్ జిల్లాలో 1153, 1156 రకం ధాన్యం వేసిన చోట్ల తాలు సమస్య  వచ్చింది.  ఇలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం సూచించిన విత్తనాలే వేయాలి.   మమ్మల్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలు కనీసం కేంద్రం నుంచి గన్నీ సంచులు ఇప్పించలేకపోయారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ 45 రోజుల్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం'' అని అన్నారు. 

''ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్లే కరోనాను నియంత్రించాం. కరీంనగర్ నుంచి కరోనాను తరిమేసాం. త్వరలో కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది. రాం విలాస్ పాశ్వాన్ సహా ఎఫ్.సి.ఐ అధికారులు తెలంగాణ ధాన్యం సేకరణ విధానాన్ని మెచ్చుకున్నారు. పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేక ధాన్యం సేకరణపై విమర్శలు చేస్తున్నారు. నల్గొండలో 100శాతం సేకరణ పూర్తయిన మాట వాస్తవమే. కానీ నల్గొండకు, కరీంనగర్ కు ధాన్యం దిగుబడిలో తేడా లేదా?సన్నరకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆ ధాన్యం అధిక రేటుకు మిల్లర్లే కొంటారు. ప్రభుత్వం వాటిని కొనదు'' అని మంత్రి గంగుల అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios