మరో సారి మంత్రి ఈటల సంచల వ్యాఖ్యలు: ఈసారి పురాణాల్లోని పాత్రలను ప్రస్తావిస్తూ...
కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషి గుర్తుండిపోవాలని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోవని, వాటిదే అంతిమ గెలుపు అని రాజేందర్ అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఉన్నట్టుండి సంచనా వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి ఈటల మరోమారు అలానే ధ్వనించే వ్యాఖ్యలు చేసారు. హుజూరాబాద్ పరిధిలోని వీణవంక మండలంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికల ప్రారంభ కార్యక్రమంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేసారు.
కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషి గుర్తుండిపోవాలని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోవని, వాటిదే అంతిమ గెలుపు అని రాజేందర్ అన్నారు.
తాను గాయపడినా తన మనసు ఎన్నడూ మార్చుకోలేదని, 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలు తనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఊరంతా ఒక దారి అయితే ఊసరవల్లిది ఒక దారి అన్నట్లు కొంతమంది ఉంటారని, మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చిందని ఇతిహాసాల్లోని పేర్లను ప్రస్తావిస్తూ పేర్కొనడం ఆసక్తికర చర్చకు దారితీసింది.
రామాయణంలో కూడా రాముడు, రావణుడు ఇద్దరూ ఉన్నారని, అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అందరూ ఒకే విధంగా ఉండరని, సమాజం ఆనాటి నుండి ఈనాటి వరకు మొత్తం ఒకటిగా ఉండదని, ఉంటే అది సమాజం కాదని ఆయన అన్నారు.
నాయకులంటే భారీ ఆకారంతో, అభరణాలతో, కులంతో పని ఉండదని, ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషని ఈటల పేర్కొన్నారు. మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసారు అన్న చర్చ సాగుతుంది.