కోమాలోకి ప్రీతి.. సీనియర్ల వల్లే ఇలా, గోప్యంగా మేనేజ్మెంట్ : వరంగల్లో మెడికో సోదరుడి ఆరోపణలు
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై ఆమె సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె కోమాలో వుందని.. 24 గంటలు గడిస్తేనే గానీ ఏం చెప్పలేమంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. బాధితురాలి పరిస్ధితి విషమంగా వుండటంతో విద్యార్ధినిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. సీనియర్ల వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు. సీనియర్ల వేధింపులపై ఫిర్యాదు చేసినా మేనేజ్మెంట్ పట్టించుకోలేదని ప్రీతి సోదరుడు ఆరోపించారు. గుర్తు తెలియని ఇంజెక్షన్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని అతను చెప్పాడు. ప్రీతి ఆరోగ్య పరిస్ధితి విషమంగా వుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆమె కోమాలో వుందని.. 24 గంటలు గడిస్తేనే గానీ ఏం చెప్పలేమంటున్నారని ప్రీతి సోదరుడు తెలిపాడు. ప్రీతి ఆత్మహత్య చేసుకున్న వ్యవహారాన్ని మేనేజ్మెంట్ దాచి పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
మరోవైపు.. మెడికో ప్రీతి ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్టుగా ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందా , ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. ప్రీతి హనికరమైన ఇంజక్షన్ తీసుకున్నట్టుగా తమకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ప్రీతితో పాటు విధులు నిర్వహించిన మరో ఇద్దరిని కూడా ఈ విషయమై విచారించినట్టుగా డాక్టర్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు.
ALso REad: మెడికో ప్రీతి ఘటనపై విచారణ: ఎంజీఎం సూపరింటెండ్ డాక్టర్ చంద్రశేఖర్
ప్రీతి ఏదైనా ఇంజక్షన్ తీసుకుంటే ఆ ఇంజక్షన్ కు విరుగుడు ఇవ్వడానికి ఈ సమాచారం తెలుసుకుంటున్నట్లు ఆయన వివరించారు. మూడు నెలల క్రితం ప్రీతి తమ కాలేజీలో చేరిందన్నారు. అయితే అప్పటి నుండి వేధింపులు జరుగుతున్నాయా లేదా అనే విషయం విచారణలో తేలనుందన్నారు. ఇంతకాలం నుండి ప్రీతి వేధింపులను భరిస్తుందా , ఇటీవల కాలంలోనే వేధింపులు ప్రారంభమయ్యాయా అనే విషయమై విచారణ కమిటీ తేల్చనుందని సూపరింటెండ్ తెలిపారు.