వైద్య విద్యార్థి ఆత్మహత్య.. వేధింపులే కారణం
ఆ వేధింపులు తట్టుకోలేక తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేక ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నగరానికి చెందిన ఆసిమ్(33) సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాననియా డెంటల్ కళాశాలలో ఎండీఎస్ కోర్సు చదువుతున్నాడు. కొద్ది రోజులుగా కాలేజ్ యాజమాన్యం ఆసిమ్ ని వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా.. చనిపోవడానికి ముందు తన ఆత్మహత్యకు కాలేజ్ యాజమాన్యమే కారణమంటూ సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. విద్యార్థి ఆత్మహత్యను నిరసిస్తూ.. పలు విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ధర్నా చేసేందుకు యత్నాలు చేస్తున్నారు.