మెదక్ జిల్లా కారు, మృతదేహం దహనం కేసును పోలీసులు ఛేదించారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. శివ, నిఖిల్, పవన్ వ్యక్తులు శ్రీనివాస్ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా కారు, మృతదేహం దహనం కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన విషయాలను మెదకల్ జిల్లా ఎస్పీ చందన దీప్తి బుధవారం మీడియాకు తెలిపారు. మెదక్లొ ఆగస్టు 9 మధ్యాహ్నం తాను హైదరాబాద్కు వెళ్తున్నానని శ్రీనివాస్ తన కారులో బయల్దేరారు. ఆ తర్వాత బిజినెస్ విషయాలు మాట్లాడుకోవడానికి శివ, నిఖిల్, పవన్ అనే వ్యక్తులను కారులో ఎక్కించుకున్నాడు శ్రీనివాస్.
Also Read:మెదక్ కారులో డెడ్బాడీ మిస్టరీ చేధించిన పోలీసులు: ముగ్గురి అరెస్ట్
ఈ క్రమంలో వెల్తుర్ది వద్ద శ్రీనివాస్ను ముగ్గురు కలిసి హత్య చేశారని ఎస్పీ తెలిపారు. తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి గాను కారును తగులబెట్టారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక నిందితుడు తమ అదుపులో వున్నాడని.. మిగిలిన ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. వ్యాపార లావాదేవీలతోనే ఈ హత్య జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయని.. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని చందన దీప్తీ వెల్లడించారు. ఈ హత్యలో ఎవరి ప్రమేయం వున్నా వదిలి పెట్టేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
కాగా, కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ధర్మకారి శ్రీనివాస్ రియల్ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. స్వగ్రామం నుండి ఆయన హైద్రాబాద్ కు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ ను హత్య చేసి అదే కారులో ఆయన డెడ్బాడీతో కలిపి కారును దగ్ధం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆర్ధిక లావాదేవీలే ఇందుకు కారణంగా పోలీసులు గుర్తించారు.వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుండి కోటి రూపాయాలు,. హైద్రాబాద్ లో మరో రూ. 50 లక్షలు రావాల్సి ఉందని ధర్మకారి శ్రీనివాస్ బంధువులు చెప్పారు.
