తెలంగాణలో మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, అనాలసిస్ వింగ్: వ్యవసాయ మంత్రి ప్రకటన
శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనల మేరకు తెలంగాణలో 4 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయని ఓ అంచనా వుందన్నారు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
హైదరాబాద్: మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల మీద అవగాహనతో ముందుకు సాగాలని వివిధ సందర్భాల్లో అన్నదాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనల మేరకు తెలంగాణలో 4 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయని ఓ అంచనా వుందన్నారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి ప్రకటించారు.
దీని నిమిత్తం రూ.15 కోట్లు ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిందని... దీనిలో భాగంగా మార్కెటింగ్ శాఖకు ముందస్తుగా రూ.6.5 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మార్కెట్ పరిణామాలు తెలుసుకుని రైతులకు మంచి ధర లభించేలా అవగాహన కల్పిచేందుకు ప్రతిష్టాత్మక సంస్థ ఎర్నెస్ట్ & ఎంగ్ కు అప్పగించడం జరిగిందన్నారు. రైతు కష్టానికి గిట్టుబాటు ధర దక్కాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు వ్యవసాయ మంత్రి.
''ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు సానుకూల విధానాలతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగింది. ఆరున్నరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా మారింది అనడానికి గత ఏడాది ఎఫ్ సీ ఐ ధాన్యం సేకరణనే నిదర్శనం. - దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యం(వరి)లో 55 శాతం కేవలం తెలంగాణ నుండే సేకరించారు'' అని తెలిపారు.
''సాగునీరు, రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు వంటి అనుకూల విధానాలతో తెలంగాణలో రైతులు సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా సాగుకు ప్రోత్సాహం అందించడం లేదు'' అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.