గద్దర్ మరణంపై మావోయిస్టుల లేఖ.. గద్దర్పై బుల్లెట్లు షూట్ చేసింది ఎవరంటే?
గద్దర్ మరణంపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆయన మృతి ఆవేదన కలిగించింది పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగాడని అందులో మావోయిస్టులు వివరించారు. టీడీపీ హయాంలో పోలీసుల ద్వారా ఏర్పాటు చేయబడి నల్లదండు ముఠాలు, పోలీసులు కలిసి 1997లో గద్దర్ పై కాల్పులు జరిపారని ఆరోపించారు.
గద్దర్ మరణంపై మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. గద్దర్ మరణం ఆవేదన కలిగించిందని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ సంతకం చేసిన ఆ లేఖలో పేర్కొన్నారు. గదర్కు ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. గద్దర్ విప్లవ జీవితాన్ని, మావోయిస్టు పార్టీతో సంబంధాన్ని ఈ లేఖలో వివరించారు.
గద్దర్ 1972 నుంచి 2012 వరకు విప్లవ ప్రస్థానం సాగిందని మావోయిస్టు పార్టీ పేర్కొంది. నాలుగు దశాబ్దాలపాటు గద్దర్ పీడిత ప్రజల పక్షాన నిలిచారని వివరించింది. సాంస్కృతిక రంగంలో ఆయన విశేష కృషి చేశాడని తెలిపింది. 1972 నుంచి 2012 వరకు ఆయన మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగారని పేర్కొంది. 80వ దశకంలో నాలుగు సంవత్సరాలు గద్దర్ దళం జీవితం సాగించాడని తెలిపింది. సాంస్కృతిక రంగం అవసరాన్ని గుర్తించి పార్టీ ఆయనను బయటకు పంపి జననాట్య మండలిని అభివృద్ధి చేసిందని వివరించింది.
ఈ సందర్భంలో మావోయిస్టు పార్టీ టీడీపీపై విరుచుకుపడింది. దోపిడీ పాలక వర్గ టీడీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబు హయాంలో విప్లవ ఉద్యమాన్ని నిర్మూలించడానికి కుయుక్తులు పన్నారని, విప్లవ ప్రతిఘాతుక శక్తులతో నల్లదండు ముఠాలను పోలీసులు ద్వారా ఏర్పాటు చేశారని ఆరోపించింది. ఈ ముఠాల ద్వారా ప్రజా సంఘాల్లో క్రియాశీలంగా పని చేస్తున్న వారిని క్రూరంగా హత్య చేయించాని పేర్కొంది. ఇందులో భాగంగానే గద్దర్ పై కూడా 1997లో నల్లదండు ముఠా, పోలీసులు కలిసి కాల్పులు చేశారని ఐదు తూటాలు గద్దర్ శరీరంలో దూసుకెళ్లాయని, అయితే, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడని వివరించింది.
Also Read: గద్దర్ పార్థీవదేహనికి నివాళి: కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్
గద్దర్ చివరి కాలంలో మావోయిస్టు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని, పాలక పార్టీలతో కలువడంపై మావోయిస్టు పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు పంపిందని తెలిపింది. అప్పుడు అంటే 2012లో మావోయిస్టు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని, ఆ రాజీనామాను పార్టీ ఆమోదించిందని వివరించింది. అప్పటి వరకు పీడిత పక్షాన నిలిచిన గద్దర్ అనంతరం బూర్జువా పార్లమెంటు మార్గాన్ని ఎంచుకున్నాడని ఆ మావోయిస్టు లేఖ పేర్కొంది.