లాయర్ల హత్య కేసు: రామగుండం సీపీపై లాయర్లు గరం గరం.. షాక్ ఇచ్చేందుకు రెడీ
లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో చేసిన వ్యాఖ్యలకు గాను రామగుండం సీపీకి షాక్ ఇవ్వాలని మంథని లాయర్లు మండిపడుతున్నారు. ఆయనకు లీగల్ నోటీస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
కరీంనగర్: మంథని బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రామగుండం సీపీకి లీగల్ నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తం అయింది. మంథనిలో లీగల్ ఫ్యాక్షన్ నడుస్తోందని ఆయన కొన్ని మీడియా సంస్థల్లో వ్యాఖ్యానించిట్టు గుర్తించిన బార్ అసోసియేషన్ సీపీ సత్యనారాయణకు లీగల్ నోటీసులు జారీ చేయాలని తీర్మానించింది
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్యకు నిరసనగా మార్చి 1 వరకు ఎలాంటి కేసులు వాదించవద్దని, విధులను బహిష్కరించాలని కూడా మంథని బార్ అసోసియేషన్ నిర్ణయించింది. వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుల తరుఫున ఎవరూ వాదించవద్దని తీర్మానం చేశారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హై కోర్టుకు లేఖ రాయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు అడ్వొకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. హత్య కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా మూడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికైనా అరెస్టయిన కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ లను మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఆ పిటిషన్ లో కోరారు.
ఈ నెల 17వ తేదీన హైకోర్టు న్యాయవాది వామన్రావు, ఆయన భార్య నాగమణిని దుండుగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. రామగిరి మండల సమీపంలో వామన్రావు కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించి.. వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.