ప్రియురాలికి పెళ్లైనా ఆమెతో ఇంకా ఫోన్లో మాట్లాడడం, కలవడం చేస్తున్నాడన్న కోపంతో ఆమె బంధువులు.. యువకుడిని దారుణంగా హత్య చేశారు.
జగిత్యాల : తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని పట్టపగలే అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ఆదివారం కలకలం రేపింది. ఓ యవతిని ప్రేమించిన ఆ యువకుడు.. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి అయిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నాడన్న కారణంతో ఈ హత్య జరిగింది.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు, బంధువులు ఇలా తెలిపారు..
జగిత్యాల జిల్లా బీర్పూర్ చెందిన జువ్వికింది వంశీ (23) తుంగూర్ లో డ్రైవింగ్ స్కూల్ లో పనిచేస్తన్నాడు. గతంలో వంశీ, ఇదే మండలానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. అయితే, ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వారికి వంశీతో ప్రేమ నచ్చకపోవడంతో…ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. ఇది జరిగి రెండేళ్లు అవుతోంది. యువతి పెళ్లయిన తర్వాత కూడా వంశీ ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. కలుసుకుంటున్నారని యువతి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం, దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోరం
ఈ నేపథ్యంలోనే వంశీని అనేకసార్లు హెచ్చరించారు. అయినా కూడా వంశీలో మార్పు రాలేదని కోపానికి వచ్చి.. చివరికి అతనిని హత్య చేశారని సమాచారం. ఆదివారం నాడు వంశీ కొల్వాయి నుంచి తుంగూరుకు టూవీలర్ మీద వెడుతున్నాడు. ఆ సమయంలో అక్కడే కాపు కాచిన ఇద్దరు వ్యక్తులు వంశీని అడ్డగించారు. గొడ్డలి, ఇతర ఆయుధాలతో తల మీద దాడి చేశారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
వంశీని హత్య చేసిన సంగతి బంధువులు, గ్రామస్తులకు తెలియడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వంశీ చనిపోయిన చోటుకి వచ్చిన వారు ఆందోళన చేపట్టారు. నిందితులను తమకు అప్పగించాలంటూ వారంతా ధర్నాకు దిగారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ప్రయత్నించారు. కానీ వంశీ తల్లి భాగ్య, బాబాయి మృతదేహాన్ని తరలిస్తే చచ్చిపోతామంటూ అక్కడే ఉన్న లారీ కింద పడుకున్నారు.
దీంతో పరిస్థితి మరి తీవ్ర పరిణామాలకు దారి తీయకుండా డీఎస్పీ ప్రకాష్, అలీ, సారంగాపూర్, రాయికల్ ఎస్సైలు తిరుపతి, అజయ్ల్ లు మృతుడి బంధువులు గ్రామస్తులతో చర్చించారు. నిందితులెవరైనా సరే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు శాంతించారు. తన కొడుకు వంశీని.. యువతి తండ్రి రమేష్, సోదరుడు విష్ణు కలిసి హత్య చేశారంటూ వంశీ తల్లి ఫిర్యాదు ఇచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, వంశీ దగ్గర ఫోన్ కనిపించడం లేదని.. హంతకులే దాన్ని తీసుకెళ్లి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంశీ తండ్రి శ్రీహరి ఉపాధి కోసం ముంబైలో ఉంటాడు. తల్లి కూలీ పనులు చేసుకుంటుంది.
