తాగడానికి బీడీ ఇవ్వలేదని... స్నేహితుడి దారుణ హత్య
కేవలం తాగడానికి బీడిలు ఇవ్వలేదన్న కోపంతో తోటి వలస కూలీని రాడ్ తో చితకబాది చంపేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్: తాగినమత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి చిన్న కారణాలతో స్నేహితున్ని అతి కిరాతకంగా హతమార్చాడు. కేవలం తాగడానికి బీడిలు ఇవ్వలేదన్న కోపంతో తోటి వలస కూలీని రాడ్ తో చితకబాది చంపేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా ఇంకోలుకు చెందిన కడియాల హన్మంతురావు, బాపూజిలు ఉపాధినిమిత్తం ఖానాపూర్ కు వచ్చి నవీన్ అనే మేస్త్రీ వద్ద పనిచేస్తున్నారు. వీరద్దరు విద్యానగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కలిసి వుంటున్నారు. అయితే నిత్యం పనులు ముగించుకున్న తర్వాత కలిసి మద్యం సేవించేవారు. ఇలాగే గత ఆదివారం కూడా మద్యం సేవిస్తుండగా ఇద్దరిమద్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లాక కూడా వీరిద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో హన్మంతును బాపూజీ రాడ్ తో విచక్షణారహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని నిందితుడు ఇంటి బయట పడేసి అక్కడి నుండి పరారయ్యాడు.
హన్మంతు మృతదేహాన్ని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమచారం అందించింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని నిందితుడు బాపూజీని అరెస్ట్ చేశాడు. అయితే ఇలా స్నేహితుని హత్యకు దారితీసిన కారణాన్ని విని పోలీసులే ఆశ్యర్యపోయారు. తాగడానికి బీడిలు, రూ.2వేలు అడిగితే ఇవ్వలేదనే కోపంంతోనే హన్మంతును చంపినట్లు నిందితుడు బాపూజీ తెలిపారు.