జగిత్యాల జిల్లాలో విషాదం... ప్రాణాలను తెగించి అన్నను కాపాడి... తమ్ముడు దుర్మరణం
అన్న ప్రాణాలు కాపాడబోయి తమ్ముడు మృతిచెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల: అన్నను కాపాడబోయి తమ్ముడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కరెంట్ షాక్ కు గురయిన అన్న ప్రాణాలను కాపాడి తమ్ముడు మాత్రం ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లె గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి, ఇతీశ్వర్ రెడ్డి అన్నదమ్ములు. గ్రామ శివారులో జంతువుల నుండి పొలం రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి శంకర్ రెడ్డి కరెంట్ షాక్ గురయ్యాడు. విద్యుత్ షాక్ తో విలవిల్లాడిపోతున్న అన్నను కాపాడడానికి ఇతీశ్వర్ రెడ్డి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతడు కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు.
read more ప్రేమలో విఫలం, బలవన్మరణం.. కుళ్లిన స్థితిలో జూనియర్ ఆర్టిస్ట్ మృతదేహం..!
ఇలా అన్నను కాపాడబోయిన ఇతీశ్వర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలతో బయటపడ్డ శంకర్ రెడ్డిని కుటుంబసభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు సమాచారం.
ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో వుండటం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇతీశ్వర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.