హైదరాబాద్ లో ఓ హత్య పలు అనుమానాలకు దారి తీసింది. ఇంట్లోనుంచి రాత్రివెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. 

హైదరాబాద్ : హైదరాబాదులో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తెల్లారేసరికి క్షేమమే కనిపించాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జవహర్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి పేరు సైఫ్ అలీఖాన్ (28). అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. అతడిని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సైఫ్ కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు. దీనికి తోడు ఇటీవల పెద్దల అంగీకారం లేకుండా మతాంతర వివాహం చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే సైఫ్ హత్యకు గురి కావడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. సైఫ్ తల్లి సుల్తానా బేగం ఓ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తుంది. తండ్రి ఎండి షఫీ చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. వీరి కుటుంబం యాప్రాల్ దగ్గరలోని కౌకూర్ లో ఉంటుంది. మృతుడు సైఫ్ గతంలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేశాడు. షామీర్పేట్ లో ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సైఫ్ ఓ హిందూ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మతాంతర వివాహం కావడంతో పెద్దలు అంగీకరించలేదు. కానీ, సైఫ్ మాత్రం ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా వేరుకాపురం పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇటీవల భార్యాభర్తలకు గొడవలు వస్తున్నాయి.

తనకంటే 11యేళ్ల చిన్నవాడైన విద్యార్థితో మహిళా టీచర్ పరార్...

దీంతో నెల రోజులుగా భార్యను వదిలేసి సైఫ్ తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. కాగా, కౌకూర్ లోని భరత్ నగర్ లో ఆరు నెలల క్రితం ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హత్య జరిగింది. సదరు వ్యక్తి గొడవలు దిగుతున్నాడంటూ అక్కడున్న యువకులు అతడి మీద దాడి చేశారు. ఈ దాడి చేసిన వారిలో సైఫ్ కూడా ఉన్నాడు. దీంతో అతని మీద కూడా కేసు పెట్టారు. ఇక సైఫ్.. గురువారం రాత్రి 20 రూపాయలు తండ్రి దగ్గర తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. తిరిగి రాలేదు. రాత్రంతా కొడుకు కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులకు తెల్లవారి శుక్రవారం ఉదయం సైఫ్ గాయాలతో పడి ఉన్నాడని కౌకూర్ భరత్ నగర్ లోని కొంతమంది వ్యక్తులు సమాచారం ఇచ్చారు.

దీంతో తండ్రి ఘటన స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే సైఫ్ మృతి చెంది ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. మృతుడి తల్లి సుల్తానా బేగం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మల్కాజిగిరి డిసి జానకి తెలిపారు. చనిపోయే ముందు రాత్రి మృతుడు మద్యం తీసుకున్నాడని తెలిసిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణలో కొంతమంది స్నేహితుల పేర్లు తెలిసాయని.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు.