మర్మాంగాలకు తగిలిన కోడి కత్తి.. వ్యక్తి మృతి
సదరు కోడి కత్తి.. సతీష్ పురుషాంగం, వృషకణాలకు తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు.
ప్రమాదవశాత్తు కోడి కత్తి ఓ వ్యక్తి మర్మాంగాలకు తగిలింది. దీంతో.. సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. లొత్తునూర్ శివారులో కోడి పందెం నిర్వహించడానికి స్థానికులు ఏర్పాట్లు చేశారు. వెల్గటూరు మండలం కొండాపూర్ కు చెందిన తనుగుల సతీష్(45) కోడి కాలికి కత్తి కట్టాడు.
రెండో కాలికి కూడా కత్తి కట్టే ప్రయత్నం చేస్తుండగా.. కోడి తప్పించుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలో సదరు కోడి కత్తి.. సతీష్ పురుషాంగం, వృషకణాలకు తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే గమనించిన స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గ మధ్యంలోనే అతను మృతి చెందాడు. దీంతో.. బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే... ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పడం గమనార్హం.