Online frauds: తాను ఒక ప్రముఖ బ్యాంకులో లోన్ ఏజెంట్ గా పనిచేస్తున్నానని నమ్మించి.. మోసాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ అక్రమాలకు పాల్పడుతున్న సదరు నిందితుడు.. ఆ డబ్బును విలాసాలకు, జల్సాలకు ఉపయోగిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Online frauds-Rachkonda police: పోలీసులు, పలు ఎన్జీవోలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ..ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాను లోన్ ఏజెంట్ ను అంటూ తనను పరిచయం చేసుకుంటూ.. వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలను సేకరించిన ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నేరాలకు ఉపయోగిస్తున్న ఒక మొబైల్ ఫోన్, రెండు సిమ్ములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ ఏడాది ఏప్రిల్ లో సంబంధిత ఆన్లైన్ మోసానికి సంబంధించి మోత్కూరు గ్రామం, యాదాద్రి-భోంగిరి జిల్లాకు చెందిన బాధితుడు మందుల మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మొదట బాధితునికి 9121088988 అనే నెంబర్ తో ఫోన్ కాల్ వచ్చింది. దీనికి బాధితుడు స్పందించాడు. అవతలి వ్యక్తి తాను ఒక ప్రముఖ బ్యాంకులో లోన్ ఏజెంట్ గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నారు. తాను 3 శాతం కమీషన్ తీసుకొని జీరో శాతం వడ్డీ రుణాలను వచ్చేలా చేస్తానని బాధితులను మాయమాటలతో నమ్మించాడు. ఇదే విషయం తన స్నేహితులకు చెప్పాడు. ఆ వ్యక్తి బాధితుల ఆధార్ & పాన్ కార్డ్ కాపీలను సేకరించి, వారి తరపున www.ZestMoney.inలో నమోదు చేసుకున్నారు. తర్వాత వారి బ్యాంకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు వచ్చిన OTP లను సేకరించి, నెలవారీ EMIలతో 0% డౌన్ పేమెంట్తో ప్రముఖ మొబైల్ షోరూమ్లో ఖరీదైన స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసి బాధితులను మోసం చేశాడు.
ఇలా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చిత్తూరు జిల్లాకు చెందిన పేరసోముల వీర నారాయణ గా గుర్తించారు. నిందితుడిపై Cr.No. 178/2022 సైబర్ క్రైమ్ PS, రాచకొండలో కేసు నమోదైంది. సేకరించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు సమయంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నిందితుడి వివరాల ఇలా ఉన్నాయి.. నిందితుడు పేరసోముల వీర నారాయణ హైదరాబాద్ వచ్చి ఓ సినిమా నిర్మించాడు. ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు వడ్డీలేని రుణాల పేరుతో మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని ప్లాన్ ప్రకారం, అతను ఒక ప్రముఖ కంపెనీలో లోన్ ఏజెంట్ అని పరిచయం చేస్తూ తెలియని నంబర్లకు యాదృచ్ఛికంగా ఫోన్ కాల్స్ చేసేవాడు.
సున్నా వడ్డీకి రుణాలు అందజేస్తానని నమ్మించేవాడు. వారి వద్ద నుంచి ఆధార్, పాన్, బ్యాంకు సహా ఇతర సమాచారం సేకరించి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నాడు. నెలవారీ ఈఎంఐలతో ఖరీదైన వస్తువులను కొని వాటిని తన సహచరుల ద్వారా తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నాడు. ఇలా మోసాలకు పాల్పడుతున్న సంపాదించిన సొమ్మును విలాసాలకు, జల్సాకు ఉపయోగించుకునే వాడని పోలీసులు తెలిపారు. ఇలా తెలియని వ్యక్తుల నుంచి రుణ ఆఫర్ లను నమ్మవద్దని రాచకొండ పోలీసు కమిషనర్ ఎం మహేష్ భగవత్ తెలిపారు.
