ప్రభుత్వ రంగ సంస్థలను  విక్రయించడంపై  రాజ్యసభలో విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే  మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను  విక్రయించాలనే ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. ఈ ప్రక్రియను తాము అడ్డుకొంటామన్నారు.

హైదరాబాద్: అచ్చేదిన్ తేవడమంటే ప్రభుత్వ రంగసంస్థలను అమ్మడమో లేదా తాకట్టు పెట్టడమేనా అని రాజ్యసభలో విపక్షనేత, మాజీ కేంద్ర మంత్రి మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు.శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్‌ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకోవడమే పనిగా పెట్టుకొందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడాన్ని తాము అడ్డుకొంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రస్తుతం 35 లక్షల మంది పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రభుత్వ రంగ సంస్థలతో 3లక్షల 25వేల కోట్ల లాభాలు ప్రభుత్వానికి వస్తున్నాయన్నారు. జాతీయ రహదారులను, 404 రైల్వే స్టేషన్లను, 101 రైళ్లను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ఆర్థికవృద్ధి రేటు పెరగడానికి ప్రభుత్వ రంగ సంస్థలే కారణం అని మల్లిఖార్జున ఖర్గే గుర్తు చేశారు. 

6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అమ్మేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయకపోతే మీరు అమ్ముతున్న ఆస్తులు ఎక్కడివి? అని ఆయన ప్రశ్నించారు. నాగార్జునసాగర్, ఆల్మట్టిని కూడా అమ్మేస్తారా అంటూ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.