కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల నివాసాలు, విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు.. అనేక సందర్భాల్లో వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాయి.
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల నివాసాలు, విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సోదాలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ కుట్రలో భాగంగానే మల్లారెడ్డిపై ఐటీ సోదాలు అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు.. చాలా సందర్భాల్లో వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాయి. న్యాక్ అక్రిడిటేషన్ కోసం పెద్ద ఎత్తున డొనేషన్లు కోరడం, మేనేజ్మెంట్ కోటా విద్యార్థులకు ప్రొఫెషనల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయడం, నకిలీ పత్రాలను సమర్పించడం వంటి ఆరోపణలను మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన పలు విద్యాసంస్థలు ఎదుర్కొన్నాయి.
కొంపల్లిలోని మల్లా రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ 2020 డిసెంబర్లో ఐదేళ్లపాటు బ్లాక్ లిస్ట్ చేసింది. బీహెచ్ఈఎల్, యాష్ టెక్నాలజీస్, ఎయిర్టెల్ పేరుతో ఇచ్చిన సర్టిఫికేట్లు కల్పితమైనవిగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ప్రత్యేకించి సీల్, సిగ్నేచర్, లెటర్హెడ్ అంశాలకు సంబంధించి ఫోర్జరీ చేసినట్టుగా చెప్పింది. అయితే తర్వాత ఆ కాలేజ్ అక్రిడిటేషన్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకుంది.
మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో.. ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో మల్లారెడ్డి విద్యాసంస్థలపై పలు విచారణలకు ఆదేశించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2009, 2012ల మధ్య మల్లా రెడ్డి గ్రూప్లో మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లలో అవకతవకలను పరిశీలించడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా ఉండేందుకు 2011లో రాష్ట్రవ్యాప్తంగా మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ల కోసం ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ను ఏపీఎస్సీహెచ్ఈ అమలు చేసింది.
ఆ తర్వాత కూడా సీట్లు కేటాయించకుండా మెరిట్ ఉన్న విద్యార్థులతో మేనేజ్మెంట్ కోటా సీట్లను బ్లాక్ చేసి.. ఆ తర్వాత తమకు నచ్చిన విద్యార్థులకు మేనేజ్మెంట్ కేటాయిస్తున్నారనే మల్లారెడ్డి విద్యాసంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఇక, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన పలు నిర్మాణాలను నిబంధనలకు విరుద్ధంగా, అలాగే నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు.
ఇక, మల్లారెడ్డి విద్యాసంస్థలను తెలంగాణలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎడ్యూకేషన్ గ్రూప్గా కూడా చెప్పవచ్చు. ఇందులో ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజ్లు, ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం, పాఠశాలలు ఉన్నాయి.
