భారీ వర్షాలు: హైద్రాబాద్లో నీట మునిగిన 250 కాలనీలు
హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాలతో పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి. సుమారు 3 లక్షల మంది తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. నగరంలోని 100 చెరువులు పూర్తిగా నిండిపోయాయి. చెరువులు అలుగుపోస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు కాలనీల్లో వరదనీరు ముంచెత్తింది.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. సోమవారం నాడు రాత్రి కురిసిన వర్షాలతో కాలనీల్లో వర్షం నీరు చేరింది. నగరంలోని సుమారు 250 కాలనీలు నీటిలో మునిగిపోయినట్టుగా అధికారులు అంచనావేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది ప్రజలు వరదతో ఇబ్బందిపడుతున్నారు.
నగరంలోని 100 చెరువులు పూర్తిగా నిండిపోయాయి. కొన్ని చెరువులు పూర్తిగా నిండిపోయి దిగువకు నీటి విడుదల చేయడంతో లోతట్టులోని కాలనీల్లోకి వరద నీరు పోటెత్తింది. మరోవైపు డ్రైనేజీ వాటర్ కూడ పొంగిపొర్లుతోంది. హైద్రాబాద్ నగరంలోని ఉస్మాన్ నగర్ లో మొదటి అంతస్తుపైకి వరద నీరు చేరింది. గత ఏడాది కూడ ఈ కాలనీలో వరదనీరు పోటెత్తింది.
ఈ ఏడాది కూడ వరద వచ్చి చేరిందని స్థానికులు చెప్పారు. వరద పోటెత్తడంతో కొందరు స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్లకు ఆరెంజ్ ఆలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైద్రాబాద్ తో పాటు ఇతర జిల్లాలలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది ప్రభుత్వం. భద్రాద్రి , వరంగల్ , నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.