క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ కుమార్కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినో వెనకాల చికోటి ప్రవీణ్ పెద్ద దందానే సాగించినట్టుగా తెలుస్తోంది.
క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ కుమార్కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ప్రవీణ్తో పాటు మాధవరెడ్డి తదితర ఏజెంట్లపై ఈడీ ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు కూడా సేకరించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘనలపై దృష్టి సారించిన ఈడీ.. హవాలా లావాదేవీలకు సంబంధించి విచారణ సాగిస్తుంది. అయితే క్యాసినో వెనకాల చికోటి ప్రవీణ్ పెద్ద దందానే సాగించినట్టుగా తెలుస్తోంది.
అతని బిగ్ షాట్స్తో పరిచయాలు ఉన్నాయని.. కొన్ని తెలుగు చానల్స్ కథనాలు ప్రసారం చేశాయి. ఆ కథనాల ప్రకారం.. చికోటి ప్రవీణ్కు దాదాపు 200 మంది కస్టమర్లు ఉన్నారు. ఆ కస్టమర్ల లిస్టులో కొందరు ఎమ్మెల్యేల, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నేపాల్కు వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రవీణ్.. చెన్నై బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్గా ఉన్నాడు. చికోటి ప్రవీణ్ చేతిలోనే నలుగురు వాహలా ఆపరేటర్లు ఉన్నారు. బేగంబజార్, బోయిన్పల్లి, సరూర్ నగర్, జగదీష్ మార్కెట్ కేంద్రంగా వాహలా దందా సాగించాడు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్, దుబాయ్లలో చికోటి ప్రవీణ్ క్యాసినో దందాలు నిర్వహించేవాడు. కస్టమర్ల నుంచి ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నాడు.
ప్యాకేజీలో.. ప్రతి జూదగాడు విమాన ఛార్జీలు, ఆహారం, హోటల్ బస, పానీయాలు, వినోదం కోసం రూ. 3 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక, కొన్ని సందర్బాల్లో అతడు ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు టాలీవుడ్తో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన సెకండ్ గ్రేడ్ హీరోయిన్లతో ప్రవీణ్కు పరిచయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పలువురు సినీ సెలబ్రిటీలతో క్యాసినోకు సంబంధించిన ప్రమోషన్ వీడియోలు చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కొందరు సినీ సెలబ్రిటీలను అతడు నేపాల్కు కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలకు ప్రవీణ్ చేసిన చెల్లింపులు, వారి మధ్య ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.
మరోవైపు ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రవీణ్ ల్యాప్ ట్యాప్ దర్యాప్తులో కీలకంగా మారనుందని.. అందులో ప్రముఖల బాగోతాలు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈడీ అధికారులు విచారణకు హాజరుకావాల్సిందిగా.. ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేశారు. అయితే తనకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై చికోటి ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని చికోటి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. సోమవారం విచారణకు హాజరవుతానని చెప్పారు. అక్కడ అధికారులకు తన వివరణ ఇస్తానని తెలిపారు. నేపాల్లో క్యాసినో లీగల్ అని కామెంట్ చేశారు. తాను క్యాసినో నిర్వహించానని.. ఇందులో ఎలాంటి మనీ ల్యాండరింగ్ వ్యవహారం లేదని చెప్పారు.
ఇక, చికోటి ప్రవీణ్పై గతంలో క్రిమినల్ కేసు నమోదైంది. 2017 అక్టోబర్ 20లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక స్టార్ హోటల్లో సోదాలు నిర్వహించి 40 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ప్రవీణ్ చికోటి, బాబులాల్ అగర్వాల్, పంటర్లతో గేమింగ్ నిర్వహిస్తున్న మరో ముగ్గురు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ. 23 లక్షల నగదుతో పాటు కార్డు స్వైపింగ్ మిషన్, హుక్కా స్టాండ్లు స్వాధీనం చేసుకున్నారు.
మాధవరెడ్డి కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్..
ఇక, ఇదే కేసుకు సంబంధించి మాధవరెడ్డి ఇంట్లో ఉన్న ఓ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపించింది. ఆ స్టిక్కర్ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉంది. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీంతో ఈ వ్యవహారంపై మాధవరెడ్డి స్పందించారు. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్టిక్కర్ను తాము గతంలోనే పడేసినట్టు స్పష్టం చేశారు.తనకిచ్చే మూడు స్టిక్కర్లు కూడా తమ కార్లకే ఉన్నాయని చెప్పారు. తాము ఎవరికి స్టిక్కర్లు ఇవ్వలేదని తెలపారు. తమకు దీనితో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
