డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అసలైన లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. వివరాలు.. రెడ్యా నాయక్ ఈ రోజు నర్సింహుల పేట మండలం జయపురంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే అక్కడ రెడ్యా నాయక్‌ను అడ్డుకున్న గ్రామస్తులు నిరసన తెలియజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అసలైన లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇదిలా ఉంటే.. సోమవారం రెడ్యా నాయక్.. బొడ్రాయితండాలో పర్యటించారు. బొడ్రాయి తండాలో తెలంగాణ క్రీడాప్రాంగణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మొత్తం 20 జీపీలు మంచి గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందగా, అందులో 19 జీపీలు తెలంగాణ రాష్ట్రంలోనివే ఉన్నాయన్నారు. జీపీలకు కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని జీపీలకు బిల్లులు చెల్లించిందన్నారు.

అనంతరం బొడ్రాయితండాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, జీపీ నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. జీపీ నిర్వహణ విధానంపై స్థానిక సర్పంచ్, అధికారులను ఆయన అభినందించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి పనులను విమర్శించే హక్కు విపక్షాలకు లేదన్నారు.