మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో 167వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ చిరుతపులి మృతిచెందింది.  

మహబూబ్ నగర్: అడవులు అంతరించిపోతుండటంతో జంతువులు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాడు. ఇలా రోడ్డుపైకి వచ్చిన ఓ చిరుతపులి గుర్తుతెలియని వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దేవరకద్ర మండలం చౌదరిపల్లి సమీపంలోని 167 జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున చిరుతపులి మృతదేహాన్ని గుర్తించిన వాహనదారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రయ్య చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్ల చిరుత చనిపోయి వుంటుందని అనుమానిస్తున్నారు. 

వీడియో

చనిపోయింది రెండేళ్ల వయసున్న ఆడ చిరుతగా గుర్తించారు. ఘటనా స్థలంనుండి చిరుత మృతదేహాన్ని తరలించారు. మన్నెంకొండ, చౌదర్ పల్లి, వెంకటాయపల్లి గుట్టల మధ్యలోంచి జాతీయ రహదారి వుండటంతో ఆహారం కోసం రోడ్డుదాటే ప్రయత్నం చేస్తూ ప్రమాదానికి గురయి అటవీ జంతువులు చనిపోతున్నట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. గతంలో కూడా ఇలాగే ఓ చిరుత చనిపోయినట్లు గుర్తుచేశారు. తాజా చిరుత మృతిపై విచారణ చేపట్టినట్లు ఎఫ్ఆర్వో చంద్రయ్య పేర్కొన్నారు.