నగరవాసులకు శుభవార్త.. వారంలో ఎల్బీనగర్ మెట్రో పరుగులు
భద్రతాపరమైన పరీక్షలన్నీ పూర్తి కావడంతో మంచి ముహూర్తం నిర్ణయించిన మెట్రోను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నగరంలో మెట్రో పరగులుపెట్టాలని నగరవాసులు కన్న కల గతేడాది తీరింది. అయితే.. ఇప్పటి వరకు మియాపూర్- అమీర్ పేట, అమీర్ పేట నుంచి ఉప్పల్ కి మాత్రమే మెట్రో రైలు పరుగులు తీసేది. అయితే.. మరో వారంలో ఎల్బీనగర్ నుంచి కూడా మెట్రో పరుగులు ప్రారంభం కానున్నాయి.
భద్రతాపరమైన పరీక్షలన్నీ పూర్తి కావడంతో మంచి ముహూర్తం నిర్ణయించిన మెట్రోను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మియాపూర్-నాగోలు మెట్రో ప్రారంభానికి గత ఏడాది యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరిగినా, అమీర్పేట-ఎల్బీనగర్ మార్గం విషయంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. త్వరగా ప్రారంభించడం కంటే.. భద్రతే అత్యంత కీలక అంశంగా పరిగణించి మూడున్నర నెలలుగా రకరకాల పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం కారిడార్-1(మియాపూర్-ఎల్బీనగర్)లో 29 కిలోమీటర్ల దూరం వరకు అన్ని పనులు పూర్తయ్యాయి. దీంతో ప్రపంచ మెట్రో రైల్వేలోనే అత్యాధునిక టెక్నాలజీగా భావించే కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్(సీబీటీసీ) పరీక్షలను అధికారులు పూర్తిచేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు సిగ్నలింగ్ సాంకేతిక వ్యవస్థను అందజేసిన కెనడాకు చెందిన థాలెస్ కంపెనీ, యూకేకు చెందిన మెట్రో రైలు సేఫ్టీ సంస్థ హాల్క్రోలు సంయుక్తంగా భద్రతా పరీక్షలు నిర్వహించాయి.
ఈ సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే రైల్వే పరిధిలోని కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్ఎస్) నిపుణుల బృందం అంతిమంగా భద్రతా పరమైన పరీక్షలు నిర్వహించింది. సీబీటీసీకి సంబంధించి అన్ని పరీక్షలు పూర్తి చేసి, సంతృప్తికరంగా ఉండటంతో సీఎంఆర్ఎస్ నిపుణుల బృందం సర్టిఫికెట్ జారీ చేసిందని మెట్రో అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.