భూకబ్జా ఆరోపణలు: ఈటెల రాజేందర్ పొలిటికల్ జర్నీపై నీలినీడలు?
భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తు రాజకీయాలపై నీలినీడలు అలుమకున్నాయి. టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు రాజేందర్ ను చిక్కుల్లో పడేస్తున్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
హైదరాబాద్: భూకబ్జా ఆరోపణలు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈటెల భూమి కబ్జా ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు రెండు గ్రామాల రైతులు కేసీఆర్ కు ఈటెల భూకబ్జా వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కేసీఆర్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోని అంతర్గత రాజకీయాల ప్రభావం ఈటెల వ్యవహారం వెలుగులోకి రావడంలో పనిచేసినట్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా ఈటెల రాజేందర్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వైరాగ్యపూరితమైన వ్యాఖ్యలు కూడా చేస్తు వస్తున్నారు తెలంగాణ ఓనర్ల వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేకాకుండా, ఈటెల రాజేందర్ తెలంగాణలో ఓ పార్టీని పెట్టడానికి సిద్ధపడినట్లు కూడా ప్రచారం సాగింది.
Also Read: ఈటల భూకబ్జా ఆరోపణలు: రెగ్యులరైజ్ కోసం ఒత్తిడి తెచ్చారు.. రిటైర్డ్ కలెక్టర్ వ్యాఖ్యలు
ఈటెల రాజేందర్ కు ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న హేచరీస్ మీద కూడా తీవ్రం ప్రభావం చూపే అవకాశం ఉంది. టీఆర్ఎస్ లో ప్రధానమైన నాయకుడిగా ఎదుగుతూ వచ్చిన ఈటెల రాజేందర్ భవిష్యత్తు ఏమవుతుందనే సందేహం తాజా పరిమామాల వల్ల ఉదయిస్తోంది.
టీఆర్ఎస్ రెండోసారి విజయం సాధించిన తర్వాత ఈటెల రాజేందర్ ను మంత్రివర్గానికి దూరంగా ఉంచాలని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగింది. కానీ, అనివార్య కారణాలతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వక తప్పలేదనే వార్తలు వచ్చాయి.
Also Read: భూకబ్జా ఆరోపణలు: ఈటెల రాజేందర్ మీద కేసీఆర్ సీరియస్?
తన తనయుడు కేటీఆర్ కు తన వారసత్వాన్ని అప్పగించి, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈటెల రాజేందర్ ను మంత్రి పదవికి దూరంగా ఉంచాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటారు. ఏమైనా, ప్రస్తుత పరిణామం ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకునే పరిస్థితిని తెచ్చింది.