సంస్థాగత ఎన్నికల ప్రక్రియను నిర్ణీత గడువులోపుగా పూర్తి చేసేందుకు పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈ నెల 15వ తేదీకి టీఆర్ఎస్ వార్డు, గ్రామ కమిటీలను పూర్తి చేయాలన్నారు.
హైదరాబాద్: ఈ నెల 15వ తేదీ నాటికి టీఆర్ఎస్ గ్రామ, వార్డు కమిటీలను పూర్తి చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలను కోరారు. సోమవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ అయ్యారు. సంస్థాగత ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం గ్రామ, వార్డు కమిటీలు పూర్తైన విషయాన్ని కేటీఆర్ పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన కమిటీలను కూడ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేటీఆర్ పార్టీ నేతలను కోరారు.
ఈ నెల 20వ తేదీ నాటికి మండల కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేటీఆర్ సూచించారు. మండల కమిటీలు పూర్తైన తర్వాత జిల్లా కమిటీలను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని కేటీఆర్ వివరించారు.ఆయా గ్రామ, మండల కమిటీల వివరాలను పార్టీ రాష్ట్ర కమిటీకి పంపాలని కేటీఆర్ కోరారు. వారం రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్టుగా కేటీఆర్ తెలిపారు.సంస్ధాగత ఎన్నికలపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా కేంద్రీకరించింది. ఈ విషయమై కేసీఆర్ గత పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థాగత ఎన్నికల గురించి చర్చించారు.
