ఈ రెండ్రోజులు జాగ్రత్త... ఎమ్మెల్యేలకు కేటీఆర్ కీలక ఆదేశాలు
ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్న రైతులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా రైతులకు అందుబాటులో వుండాలని సూచించారు.
![KTR Reacts on sudden rains and crop damage in Telangana AKP KTR Reacts on sudden rains and crop damage in Telangana AKP](https://static-ai.asianetnews.com/images/01gvsxxrwzes7s466axqbydmgw/ktr--3--jpg_363x203xt.jpg)
హైదరాబాద్ : నడి వేసవిలో తెలంగాణను వర్షం ముంచెత్తుతోంది. ఈ అకాల వర్షాలు అన్నదాతలు ఎంతో కష్టపడి పండిచిన పంట చేతికందివచ్చే సమయానికి నాశనం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తాజాగా నిన్న(మంగళవారం) తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన భీభత్సం సృష్టించింది. ఇలా అకాలవర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని... ప్రభుత్వం అండగా వుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత రైతులకు భరోసా ఇవ్వాలని కేటీఆర్ ఆదేశించారు.
మరో రెండ్రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వుండాలని కేటీఆర్ సూచించారు. వర్షాలతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని... రైతులకు అందుబాటులో వుండాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం ప్రజలకు అందుబాటులో వుంటూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Read More హైదరాబాద్ను వణికించిన భారీ వర్షం.. హుస్సేన్ సాగర్లో కొట్టుకుపోయిన బోటు, అందులో 40 మంది
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేసారు. పంటలు నష్టపోయిన రైతులెవ్వరూ అధైర్యపడొద్దని... కేసీఆర్ అండగా వుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. వ్యవసాయాభివృద్ది ఎంతో చేసిన కేసీఆర్ కు రైతులకు ఎప్పుడు అండగా వుండాలో కూడా తెలుసని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే మంగళవారం కురిసిన వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో జరిగిన పంటనష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యవసాయ అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయిన రైతుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఇలా అన్నిజిల్లాల్లో పంటనష్టం వివరాలను సేకరిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి, నువ్వు, సజ్జ వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 4,471 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరో వైపు జిల్లాలోని 20 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట, పెద్దమందడి,వనపర్తి, ఖిల్లాఘనపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. నాగర్ కర్నూల్ మార్కెట్ లో విక్రయించేందుకు తెచ్చిన మొక్కజొన్న తడిసింది. మరో వైపు ఇదే జిల్లాలోని తాడూరు మండలం సిరసనవాడలో పిడుగుపాటుకు గేదే మృతి చెందింది.
నిర్మల్ జిల్లాలోని థానూర్ మండలలో ఈదురుగాలులు, వడగళ్ల వానతో దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తంగళ్లపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ , ఎల్లారెడ్డిపేట మండలాల్లో మామిడికాయలు నేలరాలాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పంట నష్టంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారుల నుండి సమాచారం తెప్పించుకుంటున్నారు. మరో వైపు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో పంటు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి హరీష్ రావు బుధవారం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకొంటామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పంట నష్టంపై అధికారులు సర్వే ప్రారంభించారు.