Sammakka Saralamma jatara: అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అడవి తల్లుల జాతర.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం.. అదే తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే సమ్మక్క సారలమ్మ జాతర. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమ్మక – సారలమ్మ జాతరను సందర్శించారు.
Sammakka Saralamma jatara: అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అడవి తల్లుల జాతర.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం.. అదే తెలంగాణ (Telangana) కుంభమేళాగా అభివర్ణించే సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం జాతర ఈ నెల (ఫిబ్రవరి) 16న ప్రారంభమైన వన దేవతల సంబురం.. 19 వరకు ఘనంగా జరుగనుంది. సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Saralamma jatara) లో పాల్గొనేందుకు లక్షలాది వాహనాలు మేడారం తరలిరానుండగా, వేడుకలను ఘనంగా నిర్వహించడంలో పోలీసులు ఎలాంటి ఢోకా లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు, నేతలు సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓబుళాపూర్లో జరుగుతున్న సమ్మక – సారలమ్మ జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా వన దేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క – సారలమ్మకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడి భక్తులతో మాటముచ్చట కలిపారు. వారితో ఫొటోలు సైతం దిగారు. యువకులు సెల్పీలు దిగడానికి పోటీ పడగా, వారందరితో ఫొటోలు దిగారు.
అంతకు ముందు మంత్రి కేటీఆర్.. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో కేటీఆర్ రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్ను రైతులకు ఇస్తున్నామని తెలిపారు. వీటన్నింటి ఘనత గౌరవనీయులైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకే చెందుతుందని కేటీఆర్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల వరకు భూగర్భ జలాలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. “జిల్లాలో నీటి సంరక్షణ చర్యలు దేశం మొత్తానికి ప్రకాశించే ప్రమాణం. ముస్సోరీలోని IAS ట్రైనీలకు వారి పాఠ్యాంశాల్లో భాగంగా ఇక్కడి విధానాలను, చర్యల గురించి బోధిస్తున్నారు”అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Saralamma jatara) నేపథ్యంలో ఆ ప్రాంతంలో 382కు పైగా సీసీటీవీలు, రెండు డ్రోన్ కెమెరాలు, 20 డిస్ప్లే బోర్డులు, 24 గంటలూ జాతరను పర్యవేక్షించేందుకు భారీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వాహనాల ప్రవాహాన్ని నియంత్రించేందుకు దాదాపు 33 పార్కింగ్ స్థలాలు, 37 వాహనాల హోల్డింగ్ పాయింట్లు కేటాయించబడ్డాయి. ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక పోలీసు అవుట్పోస్టును ఏర్పాటు చేశారు. ఒక పస్రా మార్గం ( One Pasra route), ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక పోలీసు ఔట్పోస్టును ఏర్పాటు చేసి మొబైల్ పెట్రోలింగ్ బృందాలు పరిస్థితులను పర్యవేక్షించనున్నాయి. ఈ సారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3.5 లక్షల ప్రయివేటు వాహనాలు (private vehicles), 4 వేల ఆర్టీసీ బస్సుల (RTC buses) ద్వారా దాదాపు 1.25 కోట్ల మంది సందర్శకులు వస్తారని అంచనా.