12 మంది ఎమ్మెల్యేలకి కేటీఆర్ విందు: సీఎల్పీ విలీనానికి లేఖ
తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు అవసరమైన లేఖను గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గురువారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విందు ఇవ్వనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు అవసరమైన లేఖను గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గురువారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు చేరుకొన్నారు.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది.నల్గొండ నుండి ఎంపీగా విజయం సాధించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు స్పీకర్ ఆమోదించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం 18కు పడిపోయింది. మరో వైపు ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని టీఆర్ఎస్ గాలం వేసింది. గురువారం నాడు మధ్యాహ్నం పైలెట్ రోహిత్ రెడ్డి కేటీఆర్తో భేటీ అయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్యతో కూడ టీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. రోహిత్ రెడ్డి టీఆర్ఎస్కు మద్దతుగా నిలవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరింది. ఈ 12 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయనున్నట్టు స్పీకర్కు లేఖ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభపక్షాన్ని విలీనం చేస్తూ స్పీకర్కు ఈ రోజే లేఖను ఇవ్వనున్నారు.
2014-2019 కాలంలో తెలంగాణ శాసనమండలి, అసెంబ్లీలో కూడ టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీని విలీనం చేశారు. ఇదే ప్రక్రియను ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకత్వం అవలంభిస్తోంది. టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన 12 మంది ఎమ్మెల్యేలకు కేటీఆర్ విందు ఇవ్వనున్నారు. ఈ విందులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కూడ పాల్గొననున్నారు.
భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్యతో కూడ టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే ఈ విషయమై వీరయ్య స్పందించాల్సి ఉంది. మరో వైపు జగ్గారెడ్డి టీఆర్ఎస్లో చేరుతారా... కాంగ్రెస్లోనే కొనసాగుతారా అనే చర్చ కూడ కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోంది.
తాను గాంధీభవన్లో ఉంటానో... ప్రగతి భవన్లోకి వెళ్తానో త్వరలోనే తేలనుందని జగ్గారెడ్డి ఇటీవలనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో మల్లుభట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి మాత్రమే మిగులుతారనే ప్రచారం కూడ ఉంది. అయితే జగ్గారెడ్డి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు కొంత గందరగోళానికి గురిచేస్తున్నాయనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో లేకపోలేదు.
పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు ఇదే విషయమై లోక్పాల్లో కూడ ఫిర్యాదు చేశారు.
సంబంధిత వార్తలు
సీఎల్పీ విలీనం: ధర్నాకు దిగిన భట్టి, శ్రీధర్ బాబు
12 మంది ఎమ్మెల్యేలకి కేటీఆర్ విందు: సీఎల్పీ విలీనానికి లేఖ