2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు రూ.3కోట్ల నగదు కారులో తరలిస్తూ పట్టుబడ్డారని.. ఉత్తమ్ అందుకే ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యుల్ మొదలైన నాటి నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఒకరినొకరు విమర్శించుకుంటూనే ఉన్నారు.
తాజాగా...మంత్రి కేటీఆర్ బంధువు ప్రభాకర్, ఆయన కింది ఉద్యోగులు తనతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం ఆరోపించారు. మరో బంధువు రాధాకృష్ణారావుకు ప్రతిపక్ష నేతల వాహనాలు తనిఖీ చేసే పని అప్పగించారని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్న నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని.. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్కుమార్రెడ్డి ట్విటర్ వేదికగా హెచ్చరించారు.
కాగా ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఉత్తమ్కుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు రూ.3కోట్ల నగదు కారులో తరలిస్తూ పట్టుబడ్డారని.. ఉత్తమ్ అందుకే ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. డీజీపీ మహేందర్రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని... ఇలాంటి అంశాలను రాజకీయం చేసి అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కేటీఆర్ సూచించారు.
