నేను బీజేపీ నుండి పోటీ చేస్తే జానాకు మూడో స్థానమే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బీజేపీలో చేరాలని తనను ఆ పార్టీ నేతలు కోరుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: బీజేపీలో చేరాలని తనను ఆ పార్టీ నేతలు కోరుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్ లో పోటీ చేయాలని కూడ తనను బీజేపీ నాయకత్వం అడిగిందని ఆయన చెప్పారు. అయితే ఈ విషయమై తాను ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.
నాగార్జునసాగర్ లో బీజేపీ నుండి పోటీ చేస్తే బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతిలో తాను చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.తాను బీజేపీ నుండి పోటీ చేస్తే జానారెడ్డికి మూడో స్థానమే దక్కుతోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.రాఫ్ట్రంలో టీఆర్ఎస్ ను నిలువరించే శక్తి బీజేపీకే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
చాలా కాలంగా బీజేపీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మధ్యలో ఈ ప్రయత్నం మానుకొన్నారు. కానీ ఇటీవల తిరుపతిలో మాత్రం సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరుతానని స్పష్టం చేశారు.