Munugode ByPoll 2022 : కాంట్రాక్ట్లకు అమ్ముడుపోతే.. ఉపఎన్నికకు వెళ్లగలనా : పోస్టర్ల ఘటనపై రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలో కాకరేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడులో వెలసిన పోస్టర్ల వ్యవహారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనను టార్గెట్ చేస్తూ పోస్టర్లు వేస్తున్నారని ఆయన ఫైరయ్యారు.
కాలుష్యంతో చౌటుప్పల్ ప్రజలు అల్లాడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మునుగోడుతో పాటు తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై తాను ప్రశ్నించానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఒకపార్టీలో గెలిచి మరోపర్టీలో ఉంటోన్న వారిని పట్టించుకోలేదన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాతే నిధులు విడుదల చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాను రాజీనామా చేశాకే చేనేతలకు బీమా ప్రకటించారని రాజగోపాల్ రెడ్డి ఫైరయ్యారు. సోనియా (sonia gandhi) అంటే గౌరవం వుందని చెప్పినా, తనపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను టార్గెట్ చేస్తూ పోస్టర్లు వేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఫైరయ్యారు. కాంట్రాక్టులకు అమ్ముడుపోయే వ్యక్తి ఉపఎన్నికకు ధైర్యంగా వెళ్లగలరా అని ఆయన ప్రశ్నించారు.
ఇకపోతే... మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ను వీడి బీజేపీ గూటికి చేరుతున్న రాజగోపాల్ రెడ్డిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పోస్టర్స్లో.. ‘‘రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే.. అమిత్ షాను బేరామడిని నీచుడివి అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. మునుగోడు నిన్ను క్షమించేది లేదు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తన రాజీనామాతో మునుగోడు ప్రజల డిమాండ్లు నెరవేరుతున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాడు ఆయన మునుగోడులో మీడియాతో మాట్లాడారు. తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవగానే సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న గట్టుప్పల్ ను మండలంగా ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారన్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో అక్కడే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తాను చేసిన వ్యాఖ్యలు నిజమని ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్ధం అవుతుందన్నారు. తాను రాజీనామా ప్రకటించడంతో చేనేత కార్మికులకు కూడా పెన్షన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. తన రాజీనామాతో మునుగోడుతో పాటు రాష్ట్రంలోని పలు సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేస్తుందన్నారు.