తెలంగాణ భవన్ కిరాయికి ఇవ్వాలి : కోదండరాం చురకలు
అప్పుడు ఎన్టీఆర్ బవన్ కు అయితే.. ఇప్పుడు తెలంగాణ భవన్ కు..
తెలంగాణ భవన్ ను కిరాయికి ఇచ్చుకునే రోజులు సమీపించాయని విమర్శించారు తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం. ఆదివారం పెద్దపల్లి జిల్లా పర్యటనలో ఆయన ఈ విమర్శలు చేశారు. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని అన్నారు. అందుకే తెలంగణ జన సమితి ఆవిర్బవించిందన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో జన సమితి మాత్రమే ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల పాలన సాగుతుందనుకుంటే నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్ ను కిరాయికి ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయని, త్వరలోనే టిఆర్ఎస్ దుక్నం బంద్ కావడం ఖాయమని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు కిరాయి బోర్డు పెట్టాలని ఆనాడు టిఆర్ఎస్ నాయకత్వం ప్రకటనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరి నేడు కూడా తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయినందున తెలంగాణ భవన్ కు టులెట్ బోర్డు పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.
టిఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయయని విమర్శించారు. ఒక అబద్ధాల కోరు ప్రభుత్వం రాజ్యమేలుతోందని ఎద్దేవా చేశారు.