అంత ఇల్లు అవసరమా..?
- సీఎంకు టీ జేఏసీ చైర్మన్ ప్రశ్న
సీఎంకు అధికార నివాసం ఉన్నప్పుడు మళ్లీ ఇంకో ఇల్లు అవసరం లేదనేది తన అభిప్రాయమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.ఆయన సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఉన్న ఇల్లు సరిపోకపోతే మరో బ్లాక్ ను దానికి అనుబంధంగా నిర్మించుకుంటే సరిపోయేదన్నారు.
అలా కాకుండా 60 కోట్లు పెట్టి అతి తక్కువ వ్యవధిలో భారీ స్థాయిలో ఇల్లు కట్టించుకున్న సీఎం కేసీఆర్.. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలన్నారు.ఈ నెల 30న భూనిర్వాసితుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు కాళేశ్వరం, ఓపెన్కాస్ట్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్వాసితులందరినీ పిలుస్తున్నామన్నారు.
నిర్వాసితుల గురించి మాట్లాడితే అభివృద్ధి నిరోధకులు అనే భావనను ప్రభుత్వం విడనాడాలన్నారు. వారి సమస్యలు వినకుండా బెదిరించి భూములు లాక్కోవడం సరికాదన్నారు.
కాాగా, సీఎం క్యాంపు కార్యాలయంపై టీడీపీ నేతలది విషప్రచారమని విప్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత ఒకరు క్యాంపు కార్యాలయంలో 150 గదులున్నాయంటారు.. మరో నేత 300 కోట్లు ఖర్చు పెట్టారంటారు.. వీటికి సంబంధించి ఏమైనా ఆధారాలున్నాయా.. వీటికి జీవోలు చూపగలరా అని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల్లో ఇంతకంటే పెద్ద క్యాంప్ కార్యాలయాలున్న సంగతి టీడీపీ నేతలకు తెలియదా అన్నారు.