Agniveers : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అగ్నివీరులపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Agnipath : కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం తీవ్ర ఆందోళనలకు తెరలేపింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీసు స్టేషన్లపై దాడులు చేయడం వంటి వాటిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన సర్వత్రా విమర్శలకు దారితీసింది. శుక్రవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ అగ్నివీరులకు (అగ్నిపథ్ పథకం ద్వారా నియామకాలు) డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, వాషర్మెన్లు, బార్బర్ల వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నైపుణ్యాలు వివిధ ప్రొఫైల్లలో సహాయపడతాయన్నారు. “వీరికి నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వకూడదని నియమం ఉందా? నాలుగు సంవత్సరాల శిక్షణ తర్వాత, ఈ నైపుణ్యాలు భవిష్యత్తులో వారికి సహాయపడతాయి” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తులున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. ఆయనపై మండిపడుతున్నారు.
ఇదిలావుండగా,
దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొదట హర్యానా, పంజాబ్ లో చెలరేగిన ఆందోళనలు ఆ తర్వాత ఉత్తరభారతంలోని అనేక రాష్ట్రాలను తాకాయి. ఆ తర్వాత తెలంగాణ, ఆంధప్రదేశ్లలో పెద్దఎత్తున చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దక్షిణాధిన సైతం కేంద్ర తీరుకు వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగింది. తమిళనాడును తాకిన అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. పలు రైల్వే స్టేషన్ల వద్ద భారీగా భద్రతను మోహరించింది.
అగ్నిపథ్కు వ్యతిరేకంగా నిరసనలు శనివారం తమిళనాడుకు వ్యాపించడంతో ముఖ్యమంత్రి MK స్టాలిన్ ఆర్మీ-రిక్రూట్మెంట్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇది దేశ ప్రయోజనాలకు విరుద్ధమని, చాలా మంది ఆర్మీ అభ్యర్థులకు ఈ పథకం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. ఆర్మీ మాజీ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ కద్యన్ను ఉటంకిస్తూ స్టాలిన్ ఇలా అన్నారు: “కేవలం నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ సర్వీస్పై ఆర్మీలో చేరిన వ్యక్తి తన ప్రాణాలను కూడా అర్పించేంత వరకు కట్టుబడి ఉంటాడని మీరు ఆశించలేరు” అని అన్నారు. రిటైర్డ్ మేజర్ జనరల్ జిడి బక్షి ఈ పథకంతో తాను ఆశ్చర్యపోయానని చెప్పారు.
