మూడు సార్లు పరీక్షల్లో ఫెయిల్.. ఇక విదేశాలకు వెళ్లలేమోనని, యువతి ఆత్మహత్య
ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గార్లపాటి సింధు (23) విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పరీక్షను ఎన్నిసార్లు రాసినా క్లియర్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. తన సోదరి మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేజ ఫిర్యాదు చేశాడని అమీన్పూర్ పోలీసులు తెలిపారు.
విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పరీక్షను ఎన్నిసార్లు రాసినా క్లియర్ చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గార్లపాటి సింధు (23) తన సోదరుడు తేజతో కలసి అమీన్పూర్ పరిధిలోని పీఎన్ఆర్ కాలనీలో ఉంటోంది.
క్లినికల్ అనాలసిస్ట్గా పని చేసే ఆమె కరోనా కారణంగా ఇంటివద్ద నుంచే విధులు నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు సింధు మూడుసార్లు పరీక్ష రాసింది. అయితే ఈ మూడింట్లో వేటిలోనూ ఉత్తీర్ణత సాధించలేక పోయింది. దీంతో అప్పటి నుంచి తన స్నేహితులు విదేశాలకు వెళ్లారని, తాను వెళ్లలేకపోయానని సోదరుడికి చెబుతూ బాధపడుతుండేది. ఈ క్రమంలోనే సింధు బుధవారం తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సోదరుడు తేజ బెడ్పై నురగలు కక్కుకుంటూ సింధు పడి ఉండడాన్ని గమనించి వెంటనే చందానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా తన సోదరి మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేజ ఫిర్యాదు చేశాడని అమీన్పూర్ పోలీసులు తెలిపారు.